తప్పిన ముప్పు

6 Mar, 2019 08:26 IST|Sakshi
ప్రమాదంలో కాలిపోయిన బోగీలు

యశ్వంత్‌పూర్‌–టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం

గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ సమీపంలో అర్థరాత్రి సంఘటన

పూర్తిగా కాలిపోయిన ప్యాంట్రీకార్‌ బోగీలు

పాక్షికంగా దెబ్బతిన్న ఎస్‌–1 బోగీ

సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు

ఆరు గంటలపాటు ప్రయాణికులకు ఇబ్బందులు

సోమవారం అర్ధరాత్రి దాటింది ... మంగళవారం వేకువ జాము ... యశ్వంత్‌పూర్‌–టాటానగర్‌ (12890) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో బోగీలో మంటలు... ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికుల్లో ఆందోళన ... వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపేసి ప్రయాణికులను దించేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్యాంట్రీకార్‌ బోగీ పూర్తిగా దగ్ధమైపోగా ఎస్‌–1 బోగీ స్వల్పంగా దెబ్బతింది.

గొల్లప్రోలు (పిఠాపురం): స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో యశ్వంత్‌పూర్‌ – టాటానగర్‌ (12890) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్యాంట్రీ కార్‌ బోగీ పూర్తిగా కాలిపోయింది. ఎస్‌–1 బోగీ  స్వల్పంగా దెబ్బతింది. సిబ్బంది అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది. ఈ రైలు రాత్రి 1.47 గంటలకు గొల్లప్రోలు నుంచి కిలోమీటరు దూరం వెళ్లేసరికి 9వ బోగీగా ఉన్న ప్యాంట్రీ కారు నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో టీటీఈ, ప్యాంట్రీ కారు మేనేజర్‌ చైను లాగారు. మిగిలిన బోగీలకు మంటలు వ్యాపించకుండా ప్యాంట్రీ కారును లోకో పైలట్, గార్డు, సిబ్బంది వేరు చేశారు. అప్పటికే ఎస్‌–1 బోగీలో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులను దింపేసి ఆ బోగీని కూడా వేరు చేశారు. ఎస్‌–1లో ఉన్న ప్రయాణికులు ఆందోళనతో ట్రైన్‌ దిగేందుకు పరుగులు తీయడంతో టీటీఈ రాజేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతనిని వెంటనే సామర్లకోట రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఈ ట్రైన్‌లో మొత్తం 23 బోగీలు ఉన్నాయి. అగ్నిప్రమాదం జరిగిన ప్యాంట్రీ కారు, ఎస్‌–1 బోగీ రైలుకు 9, 10వ బోగీలుగా ఉన్నాయి. తొలుత స్థానిక రైల్వేస్టేషన్‌లోని అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం పిఠాపురం, పెద్దాపురం, కాకినాడకు చెందిన ఫైర్‌ ఇంజిన్లతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

కాలి బూడిదైన బోగీ
మంటలు ఒక్కసారి చుట్టుముట్టడంతో ప్యాంట్రీ కారు క్షణాల్లో కాలి బూడిదైంది. ఈ బోగీలో ఉన్న బియ్యం, నూనె, కూరగాయలు, ఆహార పదార్థాలు, వంట సామగ్రి, ఫర్నిచర్‌ మొత్తం పూర్తిగా కాలిపోయాయి. అయితే గ్యాస్‌ సిలెండర్లకు మంటలు వ్యాపించకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

భీతావహులైన ప్రయాణికులు
అర్ధరాత్రి.. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ ప్రమాదంతో భీతావహులయ్యారు. ప్యాంట్రీ కారులో ఉన్న సిబ్బంది, ఎస్‌–1 బోగీలోని ఉన్న ప్రయాణికులు హాహాకారాలతో పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక ట్రైన్‌ నుంచి ఒక్క ఉదుటున బయటకు వచ్చేందుకు పరుగులు తీశారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక మిగిలిన బోగీల్లోని వారు కూడా భయంతో రైలు దిగి పరుగులు తీశారు. ప్రమాదానికి గురైన బోగీలను వేరు చేశారని తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.

ఆరు గంటల పాటు..
ప్రమాదం జరిగిన తరువాత రైలు ఇంజిన్‌కు అనుసంధానంగా ఉన్న 7 బోగీలను సమీపంలోని రావికంపాడు రైల్వేస్టేషన్‌కు తరలించారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత 8 గంటల సమయంలో మిగిలిన బోగీలను వేరే ఇంజిన్‌తో అక్కడకు తరలించారు. ఎస్‌–1 బోగీ స్థానంలో మరో బోగీని విశాఖలో జత చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం సుమారు 9 గంటల సమయంలో రావికంపాడు రైల్వేస్టేషన్‌ నుంచి ఈ రైలు టాటానగర్‌కు బయలు దేరింది. కాలిపోయిన బోగీలను గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌కు తరలించారు. దీంతో సుమారు ఆరు గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్థరాత్రి సమయంలో రైలు దిగి పట్టాలపైనే ఉండిపోయారు. తాగడానికి నీళ్లు లేక, పిల్ల లకు పాలు లేక అవస్థలు పడ్డారు.

స్థానికులు, అధికారుల సహాయం
విషయం తెలుసుకున్న కాకినాడ ఆర్డీఓ రాజకుమారి ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. నగర పంచాయతీ కమిషనర్‌ సాయిబాబు, తహసీల్దార్‌ రవికుమార్, రెవెన్యూ, నగర పంచాయతీ సిబ్బంది ప్రయాణికులకు తాగునీరు, బిస్కెట్లు, టిఫిన్లు, అరటిపండ్లు అందజేశారు. స్థానికులు వారికి వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ప్రమాదంపై పలు అనుమానాలు
ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ లేదా సిగరెట్‌ పీక నిర్లక్ష్యంగా కాల్చి పారేయడం వల్ల జరిగిందా? అగ్గిపెట్టె వెలిగించడం వల్ల జరిగిందా? అన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ – 1 బోగీ సమీపం నుంచే మంటలు వ్యాపించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

సంఘటనపై పూర్తి స్థాయి విచారణ దక్షిణ మధ్య రైల్వే జీఎం మాల్యా
యశ్వంత్‌పూర్‌ – టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా తెలిపారు. సంఘటన స్థలాన్ని, కాలిపోయిన ప్యాంట్రీ కారు, ఎస్‌–1 బోగీలను ఆయన పరిశీలించారు. ప్యాంట్రీ కారు లోపలి భాగం పరిశీలించి, ప్రమాదానికి కారణాలపై, ప్యాంట్రీ కారులో ఉన్న సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరుపై చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్, ఎలక్ట్రికల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇంజినీర్‌తో కూడిన బృందం విచారణ చేస్తుందని తెలిపారు. ప్రమాద కారణాన్ని వెంటనే చెప్పలేమన్నారు. ప్యాంట్రీ కారులో ఆయిల్స్, కూరగాయలు, ఇతర వస్తువులు ఉండడం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయన్నారు. బోగీ పూర్తిగా దెబ్బతిందని, నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ప్యాంట్రీ మేనేజర్, టీటీఈ , రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రాణహాని జరగలేదన్నారు. ప్రయాణికులకు తాగునీరు, ఫలహారం అందజేశామని తెలిపారు. ఎస్‌–1 బోగీ స్థానంలో మరో బోగీని విశాఖపట్నంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఆయన తెలిపారు.

ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ
రైల్వే డివిజన్‌ అదనపు మేనేజర్‌ ఎం.రామరాజు, ఏసీఎం కమలాకర్‌ బాబు, అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఎండీఎన్‌ఏ ఖాన్, సీఐ రామయ్య తదితరులు సంఘటన స్థలం వద్ద ప్రాథమిక విచారణ చేపట్టారు. ప్రయాణికుల తరలింపు, సాంకేతిక ఇబ్బందులను పర్యవేక్షించారు. కాకినాడ అసిస్టెంట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రామయ్య ఆధ్వర్యంలో ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే పిఠాపురం సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్సై రామకృష్ణ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు