శేషాచలంలో కాల్పులు

31 Dec, 2015 01:42 IST|Sakshi

ఒక కూలీ అరెస్టు, ఏడు ఎర్రచందనం దుంగలు స్వాధీనం
 
తిరుపతి క్రైం: శేషాచలం అడవుల్లో బుధవారం రాత్రి మళ్లీ అలజడి రేగింది.  టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మంగళం పరిధిలోని రిక్షాకాలనీ వద్ద సుమారు 40మంది ఎర్రచందనం కూలీలు ఉన్నట్టు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కూలీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడిస్తుండగా ఉన్నట్టుండి పోలీసులపై దాడికి యత్నించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు.

దుండగులు పనిముట్లు, ఎర్రచందనం దుంగలను వదిలి పారిపోయారు. వారిని వెంబడించి ఒక కూలీని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలంలో సుమారు ఏడు దుంగలు దొరికాయి. చీకటిగా ఉన్నందున సరిగా కనిపించడంలేదని, అక్కడ మరికొన్ని దుంగలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. రాత్రంతా కూంబింగ్ కొనసాగించి పరారైన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.
 

>
మరిన్ని వార్తలు