విశాఖలో మొట్టమొదటి కరోనా కేసు

18 Apr, 2020 15:43 IST|Sakshi
కలెక్టర్‌ వినయ్‌ చంద్‌

సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలో మొట్టమొదటి కరోనా వైరస్‌ కేసు నమోదైందని కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 20 కేసులు నమోదు కాగా 13 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారు కూడా కోలుకుంటున్నారని వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పకడ్బందీ చర్యల కారణంగానే కరోనా కేసులు నియంత్రించగలిగామన్నారు. మార్చి 18న వచ్చిన తొలి కేసుతో తామంతా పూర్తిస్ధాయి చర్యలతో కరోనా నియంత్రణపై ప్రణాళికాబద్దంగా  ముందుకు వెళ్లామన్నారు. కరోనా నియంత్రణకి ఐఏఎస్ అధికారులు, సీనియర్ అధికారులతో 22 కమిటీలు నియమించామని చెప్పారు. 3 వేల‌ మందికి పైగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి హోం క్వారంటైన్లో ఉంచామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి కోసం సీనియర్ వైద్యులు, పల్మనాలజిస్ట్‌లతో పాటు 230 మంది ఆంధ్రా మెడికల్ పీజీ డాక్టర్లతో బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ప్రతి రోజూ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్ధితులపై ఆరా తీశామన్నారు. ( ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి )

అనుమానం వచ్చిన వారి శాంపిల్స్ సేకరించామని, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కి అనుసంధానంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు షిఫ్టులలో 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు క్షేత్రస్దాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతీ టీమ్‌లో సీనియర్ వైద్యులు, వాలంటీర్లు, జీవీఎంసీ ప్లానింగ్ సిబ్బంది ఉంటారని, కరోనా నియంత్రణలో జిల్లా యంత్రాంగానికి వాలంటీర్ల పనితీరు మరింతగా ఉపయోగపడిందన్నారు. కరోనా పాజిటివ్ కేసులని దాస్తున్నామని చేస్తున్న ఆరోపణలు అబద్దమన్నారు. కరోనా పాజిటివ్ కేసులని దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఒక కేసు దాచినా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకే విశాఖలోని కేజీహెచ్‌లో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ( హాస్పిట‌ల్ నుంచి క‌రోనా పేషెంట్ ప‌రార్‌ )

కాగా, విశాఖలో మూడో విడత ఇంటింటి సర్వే పూర్తయింది. 60 సంవత్సరాలు దాటి దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న వృద్ధులకు ట్రూ నాట్ పరీక్షలు వైద్య సిబ్బంది నిర్వహిస్తున్నారు. విశాఖలో పాజిటివ్ లక్షణాలతో ఏడుగురు వ్యక్తులు ఇంకా చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు