జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ నమోదైందంటూ ప్రచారం

7 May, 2020 08:24 IST|Sakshi
వైద్య పరీక్షల నిమిత్తం కుటుంబ సభ్యులను తరలిస్తున్న అధికారులు

బలిజిపేట మండలానికి చెందిన మహిళకు లక్షణాలు

డయాలసిస్‌ కోసం వెళ్ళిన ఆమెకు విశాఖలో కోవిడ్‌ పరీక్ష

అధికారికంగా ధ్రువీకరించని జిల్లా యంత్రాంగం

మండలంలో పరిస్థితిపై ఆరా తీస్తున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్రంలోని ఏకైక గ్రీన్‌జోన్‌ జిల్లాగా... కరోనా రహిత ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకున్న విజయనగరం జిల్లాను కోవిడ్‌–19 ఒక్కసారిగా కుదిపేసింది. తొలి కరోనా కేసు జిల్లాలో నమోదైందనే ప్రచారంతో ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా అధికారులు గానీ, రాష్ట్ర ప్రభుత్వంగాని బుధవారం రా త్రికి కూడా విజయనగరం జిల్లాలో  కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లుగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకపోతే కరోనా పాజిటివ్‌ వచ్చి న మహిళ జిల్లాలోని వివిధ ఆస్పత్రులకు డయోలసిస్‌ చికిత్స నిమిత్తం వెళ్ళారని వార్తలు వెలువడటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

బలిజిపేట మండలంలో కలవరం
జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన 45ఏళ్ళ మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు ముగ్గురు కుమారులు. వారిలో ఒకరు గత నెల 27వ తేదీన బంధువు ఒకరు చనిపోతే సీతానగరం మండలం వెళ్ళి వచ్చారు. 28వ తేదీ తన తల్లికి డయాలసిస్‌ చేయించేందుకు పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్ళి 30వ తేదీ వరకు అక్కడే ఉన్నారు.  అనంతరం ఈ నెల 1న అంబులెన్స్‌లో పార్వతీపురం నుంచి బొబ్బిలికి, అక్కడి నుంచి విజయనగరం మహరాజా ఆస్పత్రికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్ళి పోయారు. మరలా 3వ తేదీ ఉదయం విజయనగరం ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్ళి  చికిత్స చేయించి మరలా స్వగ్రామం వెళ్ళిపోయారు. 4వ తేదీ మధ్యాహ్నం అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు వెళ్ళారు. అక్కడ పరీక్షలు చేసి పెదవాల్తేరులోని టీబీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ ఆమెకు కోవిడ్‌–19 టెస్ట్‌ చేసి 29 నిముషాల్లోనే కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె విశాఖ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎమ్మెల్యే జోగారావుతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రాజకుమారి
ఈ క్రమంలో ఆ జరిపిన కరోనా పరీక్షల్లో కోవిడ్‌–19 పాజిటివ్‌ వచ్చినట్లు నిర్థారణ అయ్యిందనే వార్తలు గుప్పుమన్నాయి. వెంటనే అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం హుటాహుటిన బలిజిపేట మండలంలోని చిలకలపల్లికి సిబ్బందిని పంపించారు. ఆమె కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మొత్తం 11 మందిని గుర్తించి ప్రత్యేక అంబులెన్సులో విజయనగరం క్వారంటైన్‌కు తరలించారు. వారికి కూడా పరీక్షలు జరుపుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా ఎస్పీ బి.రాజకుమారి గ్రామానికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో శానిటేషన్‌ పనులు జరిపించి బయటివారు ఎవరూ ఆ ప్రాంతానికి రాకుండా కట్టడి చేశారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా వైద్యాధికారిణి డాక్టర్‌ ఎస్‌.వి.రమణకుమారి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి కరోనా అనుమానితుల కాంటాక్టు వివరాలను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి వారితో కలిసిన వారందరినీ గుర్తించి జిల్లా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లుగా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడని కారణంగా ప్రజలెవరూ సోషల్‌ మీడియా ప్రచారాలను నమ్మవద్దని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. కాకపోతే  పాజిటివ్‌ కేసు వచ్చిందనే ప్రచారం నేపధ్యంలో జిల్లా ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. 

బొండపల్లిలో మరో అనుమానిత కేసు
జిల్లాలో మరో కేసు కూడా ఇదేవిధంగా అనుమానాలు రేకెత్తించింది. గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలానికి చెందిన ఓ వృద్ధుడు విజయవాడలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అతనికి  కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. అతనితో పాటు అతని కుటుంబీకులు ఆరుగురిని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వీరందరికీ శ్వాబ్‌ శాంపిల్స్‌ తీశారు. పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.  

బలిజిపేట మండలంలో కలకలం
బలిజిపేట: బలిజిపేట మండలంలోని చిలకలప ల్లిలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదయిందన్న ప్ర చారంతో అందరిలో కలకలం మొదలైంది. ముందస్తు జాగ్రత్తగా డెప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ రవికుమార్‌ రెడ్డి, పీహెచ్‌సీ వైద్యాధికారి మహీపాల్, సీఐ ప్రసాద్, ఎస్‌ఐ నరేష్, సీహెచ్‌ఓ వెంకటరమ ణ, సిబ్బంది, గ్రామానికి చేరుకుని ఆ మహిళ ఇంట్లో ఉంటున్న 11మంది కుటుంబ సభ్యుల వివరాలను వైద్యశాఖ బుధవారం సేకరించి, వారందరినీ వైద్య పరీక్షల నిమిత్తం విజయనగరం పంపించారు. కాగా గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ బి.రాజకుమారి, ఎమ్మెల్యే అలజంగి జోగారావు దీనిపై చర్చించారు. పాజిటివ్‌గా తేలినట్టయితే మూడు కిలోమీటర్ల లోపు ఉండే గ్రామాలను రెడ్‌జోన్‌గా గుర్తించాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపా రు. గ్రామానికి చుట్టూ ఉండే రహదారులను దిగ్బంధం చేయాలని అధికారులను సూచించా రు. మండలం సరిహద్దులలో చెక్‌పోస్టులు ఉంచాలన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేయించాలని ఎమ్మెల్యే జోగారావు సూచించారు.  ఈ కార్యక్రమంలో డీఎస్పీ పాపారావు, తహసీల్ధార్‌ గణపతిరావు, ఎస్‌ఐ నరేష్‌ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు