చలి చంపేసింది

19 Dec, 2018 13:02 IST|Sakshi
చలి గాలులకు తట్టుకోలేక డుంబ్రిగుడ మండలం కురిడి వద్ద మంట కాగుతున్న గిరిజనులు

జిల్లాలో ఐదుగురు మృతి

వారిలో నలుగురు గిరిజనులే

అరకులోయ/పాడేరు/చోడవరం: పెథాయ్‌ తుపానుతో చలితీవ్రత పెరిగి వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగు రు గిరిజనులు కాగా ఒకరు మైదాన ప్రాంతవాసి.  అరకులోయ మండలం పంచాయతీ కేంద్రమైన మాడగడ గ్రామానికి చెందిన గిరిజన రైతు శెట్టి అమ్మన్న (48) తన వరికుప్పను వర్షం బారి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి  బాగా  తడిచాడు. రాత్రికి వరికుప్ప వద్దే బస చేశాడు. చలితీవ్రత అధికంగా ఉండడంతో సోమవారం  తెల్లవారు సమయంలో ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే వణుకుతూ మృత్యువాతపడ్డాడు. అలాగే సోమవారం కురిసిన భారీ వర్షానికి   ఇదే గ్రామానికి చెందిన గాజుల మంగ్లయ్య(40) అనే గిరిజన రైతు బాగా తడిచి  రాత్రికి ఇంటికి వెళ్లాడు.

చలితో  వణుకుతూనే  అతను కూడా రాత్రి 8 గంటల సమయంలో మృతిచెందాడు.   ఇద్దరు గిరిజన రైతులు  చనిపోవడంతో మాడగడ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. చలితో వ ణుకుతున్న సమయంలో  చలిమంటలు వేసి, రగ్గులు కప్పినప్పటికీ ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. అలా గే హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ ఇసుకగరువు గ్రామానికి చెందిన గిరిజన రైతు వంతాల మల్లన్న సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షానికి తడిచి చలిగాలులను తట్టుకోలేక  మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. పాడేరు మండలం ఇరడాపల్లి పంచా యతీ తురాయిమెట్టకు చెందిన బడ్నాయిని ఎండన్న అనే గిరిజనుడు కూడా సోమవారం రాత్రి  మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పెథాయ్‌ తుపాను కారణంగా భారీ వర్షం కురుస్తున్న సమయంలో వరి కుప్పలపై టార్పాలిన్‌ వేసేందుకు వెళ్లి పూర్తిగా తడిచిపోయాడు. తిరిగి రాత్రి ఇంటికి చేరుకున్న ఎండన్న   చలికి తట్టుకోలేక మృతి చెందాడు.

వృద్ధుడు మృతి
చోడవరం మండలంలో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మండలంలో గాలితో వర్షం కురిసింది. అధిక చలిగాలులకు మంగళవారం తెల్లవారుజామున బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన మరిశా గజ్జంనాయుడు(65) అనే వృద్ధుడు మృతి చెందాడు. 

మరిన్ని వార్తలు