ఐదుగురు దొంగల అరెస్ట్

10 Oct, 2013 03:19 IST|Sakshi

వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : జనగామ సబ్‌డివిజన్ పరిధిలో పలుదొంగతనాలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాతోపాటు మరో దొంగను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్పీ పాలరాజు నిందితుల వివరాలు వెల్లడించారు.

మెదక్ జిల్లా జమ్మికుంటకాలనీకి చెందిన ప్రవీణ్, జగద్గిరిగుట్టకు చెందిన రమేష్, విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన రాజు, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన లావుడ్యా తిరుపతి క్యాటరింగ్ టీమ్‌గా చలామణీ అవుతున్నారు. వీరిలో ప్రవీణ్, రమేష్ పాతనేరస్తులు. గతంలో ప్రవీణ్ 10 చోరీ కేసుల్లో నిందితుడు. ఇతడు ప్రస్తుతం సికింద్రాబాద్‌లో నివాసముంటున్నాడు. రమేష్ 40 దోపిడీ, చోరీ కేసుల్లో నిందితుడు. వీరిద్దరు ఆయూ కేసుల్లో జైలుకు వెళ్లారు.

జైలులో పరిచయమైన వీరు విడుదలయ్యాక జగద్గిరిగుట్టలో క్యాటరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి కుంచల రాజు, తిరుపతితో పరి చయం ఏర్పడింది. క్యాటరింగ్ ద్వారా వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో రాజు సలహా మేరకు నలుగురు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలు మొదలుపెట్టారు.

ఈ ముఠా సభ్యులు జనగామ సబ్‌డివిజన్ పరిధిలోని జనగామ, చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు, కొడకండ్ల, పాలకుర్తి పోలీస్‌స్టేషన్లతోపాటు మెదక్ జిల్లాలో చైన్‌స్నాచింగ్‌లు, తాళాలు పగులగొట్టి దొంగతనాలకు సంబంధించి 27 నేరాలకు పాల్పడ్డారు. ఇందులో చేర్యాలలో 9, బచ్చన్నపేటలో 10, మద్దూరులో 5, పాలకుర్తి, కొడకండ్లలో ఒక్కో చోరీ, మెదక్ జిల్లా పాపయ్యపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున నేరాలు చేశారు.

బుధవారం ఉదయం 6 గంట ల సమయంలో గుర్జకుంట క్రాస్‌రోడ్డు వద్ద చేర్యాల సీఐ జితేందర్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండ గా ఈ నలుగురు తారసపడ్డారు. వారు హైదరాబాద్ నుంచి జనగామ వైపు రెండు మోటారు సైకిళ్లపై వెళ్తుండగా వారిని అనుమానించి తనిఖీ చేశారు. వారి వద్ద బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. విచారించగా నిందితులు చేసిన చోరీలను వెల్లడించారు.
 
జనగామ బస్టాండ్‌లో మరో నిందితుడు....

జనగామ మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న మరో నిందితుడిని పోలీసులు బుధవారం ఉదయం జనగామ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పట్టుకున్నారు. అనుమానాస్పదంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్ల తిరుగుతుండ గా అతడిని తనిఖీ చేయగా బంగారు ఆభరణాలు గుర్తించి విచారించారు. విచారణ సందర్భంగా నిందితు డి నుంచి రూ.5 లక్షల విలువచేసే 17 తులాల బంగారం, 25 తులా ల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

అతడు జనగామ పట్టణంలోని ధర్మకంచ గ్రామాని కి చెందిన సిరాసర్ శోభరాజ్‌గా విచారణలో వెల్లడైంది. చెడు వ్యసనాలకు అలవాటుపడి కూలీ డబ్బులు సరి పోక తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి దొంగతనా లు చేసేవాడని తేలింది. గతంలో పలుమార్లు చిల్లర దొంగతనాలు చేసిన శోభరాజ్ ఇటీవల జనగామ మండలంలో ఆరు చోరీలకు పాల్పడ్డాడు.

కాగా నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన చేర్యాల సీఐ జితేందర్, జనగామ సీఐ నరేందర్, రూరల్ సీసీఎస్ సీఐ శ్రీనివాస్,ఎస్సైలు జోసఫ్, శ్రీనివాస్, ఏఎస్సై సాంబశివుడు, కానిస్టేబుళ్లు సారయ్య, సారంగపాణి, భద్రయ్య, విశ్వేశ్వర్, పాషా, హరి, సీసీఎస్ సిబ్బంది సంజీవరెడ్డి, ప్రసాద్‌ను రూరల్ ఎస్పీ పాలరాజు అభినందించారు. రూరల్ ఏఎస్పీ శ్రీకాంత్ పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు