చిత్తూరు జిల్లాలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

26 Sep, 2013 08:26 IST|Sakshi

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంటగలిసింది. తల్లి చేసిన అప్పు తీర్చలేదని  అయిదేళ్ల కూతురిని పదిరోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేశాడో కామాంధుడు. పదిరోజులుగా గుండెల నిండా భయంతో ఈ విషయాన్ని మౌనంగానే భరించిన ఆ తల్లి .... కూతురు ఎంతకూ తిరిగి రాకపోవడంతో విషయం ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ముబారక్ ఇంటిపై దాడి చేసి చిన్నారిని విడిపించారు.

వివరాల్లోకి వెళ్లితే చిత్తూరు జిల్లా పలమనేరు శివార్లలోని దాబా హోటల్లో ఓ మహిళ కూలీగా పని చేస్తోంది. నాలుగు నెలల క్రితం తన తల్లి వైద్యం కోసం ముబారక్ అనే వ్యక్తి నుంచి 2 వేల రూపాయలు అప్పు తీసుకుంది. అదే పాపమైంది. అప్పు  తీర్చలేదని పది రోజుల క్రితం  ఆమె 5 ఏళ్ల కూతుర్ని ముబారక్ తనతోపాటు తీసుకెళ్లిపోయాడు. 

తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా ముట్టజెప్పి బిడ్డను తీసుకెళ్లాలని బెదిరించాడు. దాంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన తల్లి ఇక తన కూతురి కోసం ఇరుగు పొరుగును ఆశ్రయించటంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడిన కామాంధుడు ముబారక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు