ఐదేళ్లూ.. హత్యా రాజకీయాలే! 

17 Mar, 2019 08:40 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ నేతలను టార్గెట్‌ చేసిన టీడీపీ 

రాజకీయంగా ఎదుర్కోలేక మారణహోమం 

ప్రజా సమస్యలు పక్కనపెట్టారు.. ప్రశ్నించే నాయకులను అంతమొందించారు. అవినీతి ఏరులై పారించారు. రూ.కోట్లు కూడబెట్టుకున్నారు. బాధ్యత గల పదవుల్లో ఉంటూ బరితెగించారు. పాలించమని అధికారమిచ్చిన ప్రజల ప్రాణాలు తీస్తూ తమకు ఎదురేలేదని పరమానందపడ్డారు. ఐదేళ్లూ..హత్యారాజకీయాలే చేశారు. ఎన్నికల వేళ నోట్లు జల్లుతూ ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పచ్చ పథకం పారితే...    ‘అనంత’ రక్తచరిత్ర మళ్లీ పునరావృతమవుతుందన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యతో అది మరింత పెరిగింది.   


సాక్షి, అనంతపురం సెంట్రల్‌: అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు హత్యారాజకీయాలు చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులనే టార్గెట్‌గా చేసుకొని హత్యల పరంపరను కొనసాగించారు. తాజాగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేశారు. దీంతో టీడీపీ హత్యారాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 


చర్యలు శూన్యం 
బాధితులు లిఖిత పూర్వకంగా టీడీపీ నేతలపై ఫిర్యాదు చేస్తున్నా... చర్యలు తీసుకోవడంలో పోలీసులు వెనుకంజ వేస్తున్నారు. కనీసం కోర్టు విచారణకు కూడా రాకుండా అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే అధికారపార్టీకి పోలీసులు ఏ స్థాయిలో కొమ్ము కాస్తున్నారో అర్థం చేçసుకోవచ్చు. కేవలం హత్యలే కాదు... దాడులు కూడా ఈ ఐదేళ్ల కాలంలో అనేకం చోటు చేసుకున్నాయి.  

  •  2016 మే 30న కనగానపల్లి మండలం కుర్లుపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నేత లు దాడి చేశారు. తీవ్రంగా గాయపడి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నా పరిటాల మూకలు వదల్లేదు. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ప్రకాష్‌రెడ్డిపై కూడా దాడికి యత్నించారు.  
  • 2016 సెప్టెంబరు 2న వైఎస్సార్‌ వర్ధంతి రోజున కనగానపల్లి మండలం యలకుంట్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి దిగారు.  
  • 2016 నవంబర్‌ 16న రాప్తాడు మండలం బండమీదపల్లిలో మంత్రి లోకేశ్‌ పర్యటనలో సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేశారనే సాకుతో యర్రగుంటలో ఓ మహిళపై టీడీపీ నేతలు దాడికి దిగారు. 
  •  2017 నవంబర్‌లో గొందిరెడ్డిపల్లిలో భూ సమస్యలతో సర్పంచ్‌ కుమారుడు బాబయ్య, బం ధువులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. వన్న క్క అనే మహిళపై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనల్లో అధికారపార్టీ నాయకులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.  

వివేకా హత్యపై భగ్గుమన్న ‘అనంత’ 

  • ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఘటనపై ‘అనంత’ భగ్గుమంది. టీడీపీ హత్యారాజకీయాలను వైఎస్సార్‌ సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. సౌమ్యుడిగా, ప్రజానాయకుడిగా గుర్తింపు ఉన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య చేయడం దారుణమన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు.  
  •  అనంతపురంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేతలంతా నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పాల్గొని హత్యారాజకీయాలను నిరసించారు.  
  • గుంతకల్లులో పట్టణ అధ్యక్షుడు సుంకప్ప ఆధ్వ ర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేశారు. 
  •  హిందూపురంలో పార్లమెంట్‌ అధ్యక్షులు నవీన్‌నిశ్చల్, నాయకులు కొండూరు వేణుగోపాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు.   
  •  పుట్టపర్తిలో నియోజకవర్గ సమన్వయకర్త దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.  
  •  రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో మండల నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.  రాప్తాడు నియోజకవర్గంలో చెన్నేకొత్తపల్లిలో తోపుదుర్తి శైలజ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిందితులను శిక్షించాలని కోరారు.

టీడీపీ నేతల హత్యాకాండలు కొన్ని... 

  • 2015 ఏప్రిల్‌ 29: రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయంలోని ఆర్‌ఐ ఛాంబర్‌లోనే పట్టపగలు వైఎస్సార్‌సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డిని టీడీపీ నేతలు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ హత్య ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో భయాందోళనలు కలిగించి.. పార్టీని బలహీనపరడమే లక్ష్యంగా మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం, టీడీపీ మండల కన్వీనర్‌ దగ్గుబాటి ప్రసాద్‌లు ఈ హత్య కు నిందితులను ఉసిగొల్పారని బాధితుల బంధువులు అప్పట్లో ఆరోపించారు.  
  • 2010 మార్చి 30: రాప్తాడు నియోజకవర్గం కందుకూరుకు చెందిన శివారెడ్డిని హతమార్చారు. ఈ హత్య వెనుక కూడా మంత్రి  పరిటాల సునీత, ఆమె కుమారుడు పరి టాల శ్రీరామ్‌ హస్తం ఉందని బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
  • 2015 మార్చి 31: పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సింగిల్‌ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని కూడా టీడీపీ నేతలు పొట్టన పెట్టుకున్నారు. కార్యాలయంలో సమావేశముందని పిలిపించి మరీ దారుణంగా హత్య చేశారు.  
  • విజయభాస్కర్‌రెడ్డి, ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి హత్య చేసేందుకు ప్రభుత్వకార్యాలయానే ఎంచుకోవడాన్ని చూస్తే టీడీపీ నాయకులు ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఘటనలోనూ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది.
  • 2019 మార్చి 16: కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మనేరు ఆంజనేయులు(25)ను రాత్రి దారి కాచి హత్య చేశారు. 
మరిన్ని వార్తలు