తిప్పర్తి, న్యూస్లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మామిడాల సమీపంలోని పాలేరు వాగులో కొట్టుకుపోయిన కృష్ణానీటి పైపులైన్ను శుక్రవారం పునరుద్ధరించారు. దీంతో ఐదు గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడడంతో 50 రోజుల నుంచి ఆ గ్రామాల ప్రజలు చెలిమ నీరు తాగుతున్నారు. ఈ పరిస్థితిపై ఈ నెల 10వ తేదీన ‘సాక్షి’ ‘చెలిమనీరే గతి’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది.
దీనికి స్పందించిన అధికారులు వాగులో కొట్టుకుపోయిన పైప్లైన్కు మరమ్మతులు చేియడంతో పాటు కొత్త పైప్లైన్ అమర్చి ఐదు గ్రామాలకు నీటిని పునరుద్ధరించారు. దీంతో సుమారు రెండు నెలల పాటు మంచినీటి కోసం ఇబ్బందులు పడిన తిప్పర్తి మండలం గోదోరిగూడెం, యల్లమ్మగూడెం, ఆరెగూడెం, వేములపల్లి మండలం చిరుమర్తి, పోరెడ్డిగూడెం గ్రామాలకు శుక్రవారం తాగునీరు రావడంతో ఇబ్బందులు తొలగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు సాక్షి పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.