అంతరిక్ష విజ్ఞానంపై దృష్టిసారించాలి

2 May, 2015 01:44 IST|Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్: అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు దృష్టి సారించాలని పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి పేర్కొన్నారు. స్పేస్ క్లబ్ ఆఫ్ విజయ ఎడ్యుకేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 30న అంతరిక్ష విజ్ఞానంపై రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న పోటీ పరీక్షకు సంబంధించిన పోస్టర్‌ను పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షాభవన్‌లో శుక్రవారం విడుదల చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్జేడీ పార్వతి మాట్లాడుతూ దేశ ప్రగతిలో భాగస్వాములై ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాలనుకునేవారికి అంతరిక్ష పరిశోధనా రంగం ప్రధానమైనదన్నారు. ప్రతి విద్యార్థి పోటీ పరీక్షలో పాల్గొని ప్రతిభ చూపాలని సూచించారు.

మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష పరిశోధన, శాటిలైట్ ప్రయోగాల్లో ఎన్నో విజయాలను నమోదు చేశారని పేర్కొన్నారు. సంస్థ కార్యదర్శి జి.శాంతమూర్తి మాట్లాడుతూ అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించి విద్యార్థుల్లోని క్రియాశీల ఆలోచనలు, సృజనాత్మక భావాలు వెలికితీయాలనేది ఈ పోటీ పరీక్ష ఉద్దేశమని తెలిపారు.

8, 9, 10వ తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఈనెల 30న నిర్వహించే పోటీ పరీక్షకు ఆసక్తి గల కళాశాలస్థాయి విద్యార్థులు హాజరుకావచ్చని తెలిపారు. వివరాలకు సెల్ నం: 94924 64329, 73961 98709 లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎం అండ్ ఎం షోరూమ్ ఎండీ సాధిక్, పర్యావరణ విద్యావేత్త డి.తిరుపతిరెడ్డి, విశ్రాంత డీఈవో ఫ్రాంక్లిన్, సువర్ణరాజు, కోస్టల్ కేర్ ఎండీ డాక్టర్ జాన్‌బాబు, సలీంబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు