‘మాసినేని’ బిర్యానీ తింటే ‘రంగు’పడుద్ది!

11 Dec, 2019 08:46 IST|Sakshi

ఆహార పదార్థాల్లో అధికంగా రంగుల వినియోగం

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలో బట్టబయలు  

నగరంలోని పలు హోటళ్ల నుంచి శాంపిల్స్‌ సేకరణ

అనంతపురం న్యూసిటీ: ‘మాసినేని గ్రాండ్‌’ నగరం నడిబొడ్డున ఉన్న త్రీస్టార్‌ హోటల్‌.. ఇక్కడ పొరపాటున సామాన్యుడు భోజనం చేశాడంటే బిల్లు చుక్కలు చూడాల్సిందే. పోనీ నాణ్యమైన ఆహారం పెడుతున్నారంటే అదీ లేదు. రంగుల మిశ్రమంతో చేసిన ఆహార పదార్థాలు వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. మంగళవారం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు మాసినేనిలో తనిఖీలు నిర్వహించగా.. ఈ బాగోతం బయటపడింది. నగరంలోని కొన్ని హోటళ్ల నిర్వహణపై కలెక్టర్‌ గంధం చంద్రుడుకు ఇటీవల ఫిర్యాదులందాయి. దీంతో ఆయన హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయలని ఫుడ్‌ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ శ్రీనివాసరెడ్డి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నగరంలోని మాసినేని, హ్యాంగౌంట్స్, హరియాణా జిలేబీ సెంటర్లను తనిఖీ చేశారు. మాసినేని గ్రాండ్‌లో బిరియాని, చికెన్‌ తందూరిలో అధికంగా రంగులు కలిపినట్లు అధికారులు గుర్తించారు. ఇలా రంగులు కలపడం వల్ల కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. మాసినేనిలోని ఆహార పదార్థాల శాంపిల్స్‌ తీసుకున్నారు. గతంలోనూ మాసినేని గ్రాండ్‌లో కుళ్లిన మాంసం, బూజు పట్టిన తినుబండారులు ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలో తేలిన విషయం విదితమే. కానీ అప్పట్లో టీడీపీ అండంతో ఎలాంటి కేసు నమోదు కాకుండా యాజమాన్యం తప్పించుకుంది.

శాంపిల్స్‌ సేకరణ
అనంతరం అధికారులు హ్యాంగౌట్స్‌లో తనిఖీ చేశారు. ఫ్రీజర్‌లో ఉంచి పలు ఆహార పదార్థాలను సేకరించారు. రంగులు అధికంగా వేసినట్లు గుర్తించారు. హర్యానా జిలేబీ నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా టమాట సాస్‌ చేస్తుండగా.. అధికారులు శాంపిల్స్‌ సేకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ రెడ్డి, కరీముల్లా మాట్లాడుతూ, సేకరించిన ఆహార పదార్థాలను ల్యాబ్‌కు పంపుతామన్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.   

మరిన్ని వార్తలు