నిమ్మగడ్డ లేఖపై సీఐడీకి అందిన ఫోరెన్సిక్‌ నివేదిక

5 May, 2020 13:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లేఖకు సంబంధించి వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ లేఖకు సంబంధించి సీఐడీ అధికారులు అనేక విషయాలను రాబట్టారు. తాజాగా ఆ లేఖ ఎస్‌ఈసీ ఆఫీస్‌లో తయారుకాలేదని నిర్దారణ అయింది. ల్యాప్‌ టాప్‌, డెస్క్‌ టాప్‌లను పరిశీలించిన ఫోరెన్సిక్‌ నిపుణలు.. ఆ లేఖ ఎస్‌ఈసీ కార్యాలయంలో తయారు కాలేదని తేల్చారు. ఈ మేరకు సీఐడీ అధికారుల చేతికి ఫోరెన్సిక నివేదిక అందింది. (చదవండి : రమేష్‌ కుమార్‌ లేఖను లెక్కతేల్చే పనిలో సీఐడీ)

ఇందుకు సంబంధించి సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రమేష్‌ కుమార్‌ పీఏ సాంబమూర్తి అన్ని అసత్యాలే చెప్పారని అన్నారు. ఆ లేఖను ముందుగానే తయారుచేశారని.. అది బయటి నుంచి వచ్చిందని తెలిపారు. మార్చి 18వ తేదీ ఉదయం పెన్‌డ్రైవ్‌లో ఆ లేఖ రమేష్‌ కుమార్‌ వద్దకు చేరిందన్నారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరలోనే తేలుస్తామని చెప్పారు. 

కాగా, రమేశ్‌ కుమార్‌ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై తొలి నుంచి అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతో ఈ లేఖను టీడీపీ కార్యాలయంలో తయారైందని, ఆ లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను రమేష్‌ కుమార్‌ లేఖపై విచారణ చేపట్టాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ సందర్భంగా రమేశ్‌ కుమార్‌ చేసిన సంతకానికి, కేంద్ర హోంశాఖకు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదని విజయసాయిరెడ్డి అన్నారు. (చదవండి : నిమ్మగడ్డ నిర్ణయం ఏకపక్షం)

మరిన్ని వార్తలు