సాంబమూర్తినగర్ (కాకినాడ) : కాకినాడ 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చామకూర ఆదినారాయణ అలియాస్ నాగబాబు అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఆయన 1947 డిసెంబర్ 12 న జన్మించారు. 1983లో ఇండిపెండెంట్గా కౌన్సిలర్ స్థానానికి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ మున్సిపాలిటీలో మరో రెండుసార్లు కౌన్సిలర్గా, నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ అయిన అనంతరం 24వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందారు. అపోలో ఆస్పత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహానికి శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పరామర్శ
నాగబాబు పార్థివ దేహాన్ని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. మనసున్న మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. నాగబాబు భౌతికకాయాన్ని మాజీ కౌన్సిలర్ జోగా రాజు, మాజీ కార్పొరేటర్లు సిరియాల చంద్రరావు, ఫ్రూటీకుమార్, వైఎస్సార్ సీపీ ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వర రావు తదితరులు సందర్శించారు.