మాజీ మంత్రి మాదాల కన్నుమూత

30 Aug, 2019 20:37 IST|Sakshi

ఉదయగిరి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాదాల జానకిరాం (67) బుధవారం కన్నుమూశారు. రెండ్రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో ఆయనను నెల్లూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దుత్తలూరు మండలం ఉలవవారిపాళెంకు చెందిన మాదాల జానకిరాం 1978లో రాజకీయరంగ ప్రవేశం చేశారు.  

1989 అసెంబ్లీ ఎన్నికల్లో కె.విజయరామిరెడ్డిపై పోటీచేసి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. 1991–1993 వరకు అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్‌లో బొగ్గు, భూగర్భ గనుల శాఖ మంత్రిగా పని చేశారు. స్వగ్రామం ఉలవవారిపాళెంలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. కాగా, మాదాల జానకిరాం మృతిపై ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. జానకిరాం మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సంతాపం తెలిపారు. జానకిరాం కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  

మరిన్ని వార్తలు