మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కన్నుమూత 

11 Jan, 2019 02:23 IST|Sakshi

రాయచోటి: వైఎస్సార్‌ జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నారాయణరెడ్డి (65) గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 10 రోజులుగా శ్వాసకోస, గుండెనొప్పి సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం ఉదయం రెండు సార్లు గుండెపోటు రావడంతో నారాయణరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దివంగత ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి 1991లో రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో సోదరుడి కుమారుడైన నారాయణరెడ్డి రాజకీయ వారసుడిగా వచ్చారు.

ఆయన 1993 లో జరిగిన ఉప ఎన్నికల్లో, 1994 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌  అభ్యర్థిగా  గెలుపొందారు. 1999 ఎన్నికల్లో ఓటమి చెందారు. చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం బోడిరెడ్డిగారిపల్లెకు చెందిన మండిపల్లి జయరామిరెడ్డి, మల్లమ్మల దంపతులకు 1955 జూలై 1న నారాయణరెడ్డి జన్మించారు. ఆయనకు కుమార్తె సద్గుణ, కుమారుడు రాహుల్‌రెడ్డి ఉన్నారు. శుక్రవారం చిన్నమండెం మండలం దేవగుడిపల్లె సమీపంలోని ఆయన స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు్ల కుటుంబీకులు తెలిపారు.  

మరిన్ని వార్తలు