నాడు టీడీపీ ట్రస్టు బోర్డుగా మన్సాస్‌!

7 Mar, 2020 14:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉండే హక్కు మహిళలకు లేదంటూ మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు వాదించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అశోక్‌ గజపతిరాజు సోదరుడు ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును దేస్థానం ట్రస్టు బోర్డు, మన్సాన్‌ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇటీవల ప్రమాణం స్వీకారం చేసి.. తనకు ఇంతటి బృహత్తర బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ పరిణామాలపై అశోక్‌ గజపతి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సంచయితకు కీలక బాధ్యతలు అప్పగించడాన్ని సహించలేకపోతున్న ఆయనకు గతంలో జరిగిన పరిణామాలు గుర్తుకురావడం లేదా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. (సంచలనమైన సీఎం జగన్‌ నిర్ణయం )

కాగా 2016 ఏప్రిల్‌లో మాన్సాస్‌ వ్యవహారం టీడీపీ చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ చెరుకూరి కుటుంబరావు, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఐవీ రావులను ట్రస్టు సభ్యులుగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ 7న జీవో 139 జారీ చేసింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్‌ 27న వారిద్దరిన్నీ కొనసాగిస్తూనే... జీవో నంబర్‌ 155 ద్వారా అశోక్‌గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా బోర్డు సభ్యురాలిగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. అయితే అప్పుడు పూసపాటి వారసురాలైన ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈ క్రమంలో సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసిన ప్రభుత్వం... తాజాగా ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమించింది. అదే విధంగా... అశోక్‌ గజతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా సభ్యురాలిని చేసి.. ఆమెతో పాటు మొత్తంగా ఇదే కుటుంబానికి చెందిన ముగ్గురికి మాన్సాస్‌ ట్రస్టుబోర్డులో స్థానం కల్పించింది.

మరిన్ని వార్తలు