ఇలాగైతే రాజధానిని మీరు చూడలేరు.. మేము చూడలేం

8 May, 2016 02:08 IST|Sakshi
ఇలాగైతే రాజధానిని మీరు చూడలేరు.. మేము చూడలేం

కృష్ణాయపాలెం(మంగళగిరి): ‘సీఆర్‌డీఏ అధికారులిచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా..భూములను మీ చేతిలో పెట్టి మేము అడుక్కోవాలా..13 జిల్లాల ప్రజల కోసం 29 గ్రామాల రైతులను బలి పశువులను చేస్తారా..రెండేళ్లలో రాజధాని నిర్మాణం కోసం రైతుల వద్ద భూములు తీసుకోవడం తప్ప ఇంకేమైనా సాధించారా..ఇలాగైతే రాజధానిని మీరు చూడలేరు..మేము చూడలేము..ఇదే విధంగా రైతులను మభ్యపెడుతూ కాలయాపన చేస్తే భవిష్యత్తులో సీఆర్‌డీఏ అధికారులు గ్రామాల్లో తిరగలేరు’ అంటూ రైతులు హెచ్చరించడంతో సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. మండలంలోని కృష్ణాయపాలెం పంచాయతీ కార్యాలయం శనివారం వద్ద సీఆర్‌డీఏ అధికారులు ప్లాట్లు కేటాయింపుపై నిర్వహించిన అవగాహన సదస్సులో రైతులు నిరసన తెలిపారు.


 రైతులు రాజధాని భూసమీకరణ ప్రారంభించక ముందు ఎకరా మూడు కోట్లు అమ్మారని, తమ గ్రామాన్నీ అర్బన్ సెమీలో చేర్చాలని చెప్పినా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. అడిషనల్ జేసీ చెన్నకేశవులు అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకిచ్చే నివాస, వాణిజ్య స్థలాల్లో నిర్మాణాలకు ఇస్టానుసారం నిబంధనలు విధిస్తారా అంటూ ధ్వజమెత్తారు. ‘మా భూముల్లో గజం ఎక్కువుంటే కొనుగోలు చేస్తారా..మాకు నిర్మాణాలకు నిబంధనలకు అనుగుణంగా పది గజాలు కావాల్సి వస్తే మాత్రం అమ్మరా’ అని ప్రశ్నించారు.

దీంతో అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతూ అన్ని సమస్యలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సమావేశం ముగించారు. సమావేశంలో ప్లానింగ్ డెరైక్టర్ నాగేశ్వరావు, డిప్యూటి కలెక్టర్ ధనుంజయ ,తహశీల్దార్లు, సిబ్బంది, రైతులు నరసింహారావు, వెంకట్రావు, అనీల్, నగేష్, వెంకటరమణ, గోపాలరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు