నాలుగో విడత రేషన్‌ పంపిణీ ప్రారంభం

16 May, 2020 09:54 IST|Sakshi

సాక్షి, విజయవాడ: లాక్‌డౌన్‌ వేళ పేదల ఆకలిని తీర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నాలుగో విడత  రేషన్‌ పంపిణీ  కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున పీడీఎఫ్ బియ్యం, కేజీ శనగలు  అందజేసున్నారు. రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలు బియ్యంకార్డులు కలిగి ఉన్నాయి. కొత్తగా 81,862 పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. కార్డుదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ అందజేస్తున్నారు.  రేషన్ షాప్ కౌంటర్ల వద్ద డీలర్లు శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. (ఆ గ్రామస్తులకు ఏ కష్టం రాకూడదు)


నేటి నుంచి 27వ తేదీ వరకు సరుకులను పంపిణీ చేయనున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కో కుటుంబసభ్యుని ఐదు కేజీల ఉచిత బియ్యం, అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు 35 కేజీల ఉచిత బియ్యం పంపిణీ చెస్తున్నారు.  అన్నపూర్ణ కార్డుదారులకు పదికిలోల ఉచిత బియ్యం అందజేస్తున్నారు.  ప్రతీ కార్డుకూ కిలో శనగపప్పు ఉచితంగా ఇస్తున్నారు. వేలిముద్ర తప్పనిసరి కావటంతో రేషన్ షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌ ఆదేశాలతో రేషన్ కార్డు లేని పేదలకు కూడా సరుకులు పంపిణీ చేస్తున్నారు.  సబ్సి డీ ధరపై అర కేజీ పంచదార అందజేస్తున్నారు.  

కృష్ణా జిల్లాలో 12, 59,936 రేషన్‌ కార్డు దారులు లబ్ది పొందనున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడే సరుకులు తీసుకొనేలా పోర్టబిలిటీ అవకాశం కల్పించారు. కరోనా కారణంగా కూపన్ల పద్ధతి అమలు చేస్తున్నారు. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా టైం స్లాట్ కూపన్లను అధికారులు అందజేస్తున్నారు. కూపన్‌లో సూచించిన తేదీలో నిర్ధేశించిన సమయానికే లబ్ధిదారులు రేషన్‌కి రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లబ్ధిదారులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. మాస్కులు ధరించి క్యూలైన్‌లో దూరం పాటించాలని అధికారులు లబ్ధిదారులకు సూచనలు ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు