రైతులకు ఏపీ సర్కార్‌ తీపి కబురు

4 Jul, 2020 14:11 IST|Sakshi

సాక్షి, అమరావతి : విద్యా, వైద్యం, ఆరోగ్యంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక మార్పులు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయంలోనూ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని సన్న, చిన్న కారు రైతులకు ఆదుకునేందుకు ఉచిత బోరు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమల్లో ఉన్న ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కింద రైతుల పంటపొలాల్లో ఉచితంగా బోర్లు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు వేయించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. అర్హత గల రైతులు గ్రామ సచివాలయంలో పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డుల  ఆధారంగా దరఖస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అర్హతలు, విధివిధానాలు..
► రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి. అంత భూమి లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడవచ్చు. ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండవచ్చు. ఈ అర్హతలు ఉన్న రైతులు బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు ఆ భూమిలో ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. 
► అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
► పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేస్తారు. 
► బోరు బావి మంజూరు అనంతరం ఆ çసమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతుకు తెలియజేస్తారు. 

మరిన్ని వార్తలు