మహానేత ఆశయాల కోసం పాటుపడదాం

3 Sep, 2018 13:00 IST|Sakshi
వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న అప్పిరెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, రోశయ్య, లాలుపురం రాము, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు

వైఎస్సార్‌ సీపీ నేతల పిలుపు

వైఎస్‌ వర్ధంతి సందర్భంగా ఆరువేల మందికి ఉచిత పరీక్షలు, మందులు పంపిణీ, భారీ అన్నదానం

వైఎస్సార్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఐదేళ్లుగా నిర్వహణ

పట్నంబజారు(గుంటూరు): మహానేత వైఎస్‌ ఆశయాల కోసం పాటుపడదామని వైఎస్సార్‌ సీపీ నేతలు పిలుపునిచ్చారు. వైఎస్‌ వర్ధంతిని పురస్కరించుకుని పట్టాభీపురం రెడ్డి జనసేవా సమితి కార్యదర్శి, వైఎస్సార్‌ అభిమాన సంఘం కానాల అంజనీ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి థియేటర్‌ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంటరీ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య హాజరయ్యారు. ముందుగా వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి వైఎస్సార్‌ చేయూతనిచ్చారన్నారు.

ఆయన ఆశయాల కోసం పేదలకు సాయం అందించటం సంతోషకరమైన విషయమన్నారు. పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వైద్యశిబిరాన్ని నిర్వహించిన వైఎస్సార్‌ అభిమాన సంఘం సభ్యుల్ని అభినందించారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ మహానేతను గుర్తు చేసుకుంటూ, పేదలకు అండగా నిలిస్తూ, గొప్ప మనసును చాటుకున్నారన్నారు. వైఎస్సార్‌ అభిమానం సంఘం సభ్యులు కానాల అంజనీ శ్రీకాంత్‌రెడ్డి, ఇన్నారెడ్డి, సీతారామిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లుగా మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరు వేల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయటంతో పాటు పదివేల మందికి అన్నదానం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శిబిరానికి హాజరైన రోగులకు ఆసుపత్రికి వెళ్లిన తరువాత కూడా 50శాతం రాయితీ కల్పిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతంరం వైద్య శిబిరానికి హాజరైన వారికి పండ్లు, బ్రెడ్‌ను కూడా అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి లాలుపురం రాము, వైఎస్సార్‌ అభిమాన సంఘం సభ్యులు మస్తాన్‌వలి, రాము, ప్రభు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు