బియ్యం కార్డు లేకున్నా ఆధార్‌తో పేదలకు ఉచిత సరుకులు

3 May, 2020 03:21 IST|Sakshi

4 నుంచి కార్డుల్లేని 81,862 మందికి పంపిణీ

మూడో విడత పంపిణీలో భాగంగా నాలుగు రోజుల్లోనే 90 లక్షల మందికి పైగా అందిన సరుకులు

పోర్టబిలిటీ ద్వారా లబ్ధి పొందిన 20 లక్షలకుపైగా కుటుంబాలు

రేషన్‌ అందకపోతే చేయాల్సిన ఫోన్‌ నంబర్‌ 1902

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బియ్యం కార్డులు లేని పేదలకు ఆధార్‌ నంబర్‌ ఆధారంగా ఉచిత రేషన్‌ సరుకులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బియ్యం కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను వలంటీర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి 81,862 మందిని అర్హులుగా తేల్చారు. అయితే.. ప్రస్తుతం సామాజిక తనిఖీ నిర్వహించే అవకాశం లేనందున వారికి కొత్తగా బియ్యం కార్డులకు సంబంధించి నంబర్లను జారీ చేయలేని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో బియ్యం కార్డులు లేకపోయినా కుటుంబ యజమాని ఆధార్‌ నంబర్‌ ఆధారంగా ఈ నెల 4 నుంచి∙వారందరికీ ఉచిత రేషన్‌ సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. ఆధార్‌ నంబర్‌ను ఈ – పాస్‌ మిషన్‌లో నమోదు చేయనున్నారు. వారి నుంచి బయోమెట్రిక్‌ తీసుకొని సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

► లాక్‌డౌన్‌ కారణంగా ఆహారం కోసం పేదలు ఇబ్బందులు పడకుండా ఇప్పటికే రెండు విడతలుగా ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేసింది.
► మూడో విడత రేషన్‌ పంపిణీ ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే 90,95,969 కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి.
► రాష్ట్రంలో 20,02,224 మంది లబ్ధిదారులు పోర్టబిలిటీ ద్వారా లబ్ధి పొందారు.
►​​​​​​​ రాష్ట్రంలో 1,47,24,016 తెల్ల రేషన్‌ కార్డులున్న లబ్ధిదారులకు ఉచిత సరుకులు పంపిణీ చేస్తారు.
►​​​​​​​ రేషన్‌ అందకపోయినా, ఇతర ఇబ్బందులు ఉన్నా 1902 నంబర్‌కు ఫోన్‌ చేస్తే అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు.

మరిన్ని వార్తలు