రెండు రోజుల్లో అరకోటి కుటుంబాలకు

18 May, 2020 03:55 IST|Sakshi
గుంటూరులో దివ్యాంగురాలైన ఇంద్రజకు రేషన్‌ అందజేస్తున్న వలంటీర్‌ చిరంజీవి

రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా సరుకులు 

కొనసాగుతున్న నాలుగో విడత ఉచిత రేషన్‌ పంపిణీ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్‌ సరుకులను రెండు రోజుల్లో 50,99,293 కుటుంబాలకు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో 1.48 కోట్ల కుటుంబాలకు ఇప్పటికే మూడు విడతలు బియ్యంతో పాటు కందిపప్పు / శనగలు పంపిణీ చేశారు. నాలుగో విడత పంపిణీ శనివారం నుంచి ప్రారంభించారు. సరుకుల కోసం వచ్చిన లబ్ధిదారులు వెనక్కు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించడంతో రేషన్‌ డీలర్లు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపుల వద్దే ఉండి పంపిణీ చేస్తున్నారు. సమయంతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులు ఎప్పుడు వచ్చినా మానవతా దృక్ఫథంతో సరుకులు ఇవ్వాలని డీలర్లందరితో చర్చించి నిర్ణయించినట్లు రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు తెలిపారు. 

అత్యధికంగా ‘అనంత’లో... 
► నాలుగో విడత ఉచిత రేషన్‌తో ఆదివారం నాటికి అరకోటి కుటుంబాలు లబ్ధి్దపొందాయి.
► 12,61,917 కుటుంబాలు పోర్టబులిటీ ద్వారా రేషన్‌ తీసుకున్నాయి.
► రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన అదనపు కౌంటర్ల ద్వారా 2.51 లక్షల మంది రేషన్‌ తీసుకున్నారు.
► అత్యధికంగా అనంతపురం జిల్లాలో 44.05 శాతం కుటుంబాలు సరుకులు అందుకున్నాయి.

మరిన్ని వార్తలు