బకాయిలు అందవు.. పత్రాలు ఇవ్వరు !

30 Jul, 2014 02:50 IST|Sakshi
బకాయిలు అందవు.. పత్రాలు ఇవ్వరు !

 ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థి తాను చదువుకున్న కోర్సు పూర్తికాగానే ఉన్నత చదువు చదవాలన్నా, ఉద్యోగ ప్రయత్నం చేయూలన్నా స్టడీ, కాండాక్ట్‌ప్రొవిజినల్, టీసీ, ఓడి వంటి ధ్రువీకరణ పత్రాలు ఎంతో అవసరం అవుతాయి. ప్రస్తుతం కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పరీక్షల రిజల్ట్ కంటే రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలు మంజూరు కోసం విద్యార్థులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్  అంబేద్కర్ యూనివర్సిటీలో అధికారులు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు మంజూరు అయితేనే ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు.
 
 లేకపోతే ప్రభుత్వం బకాయి పడ్డ సొమ్ములు విద్యార్థులు చెల్లించి రీయింబర్స్‌మెంట్ సొమ్ము మంజూరు కాగానే వాటిని విద్యార్థులు తీసుకోవాలని మెలిక పెడుతున్నారు. గతంలో సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖలు ఇచ్చిన హామీ పత్రాలతో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవారు .ప్రస్తుతం మాత్రం అధికారులు బకాయిలు ఉన్న విద్యార్థులకు హామీ పత్రాలతో ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటం లేదు.విద్యార్థులుకు ప్రభుత్వం సకాలంలో రీయింబ ర్స్‌మెంట్, ఉపకార వేతనాలు మంజూరు చేయడంలేదు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో 16 కోర్సులకు చెందిన విద్యార్థులు సుమారు 400 మంది వరకు ఈ ఏడాది రిలీవ్ అయ్యారు. ఏప్రిల్ నెల నాటికే వీరికి రీయింబార్స్ మెంట్, ఉపకార వేతనాల నిధులు విడుదల కావాలి. అయితే విద్యా సంవత్సరం ముగిసి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా నిధులు విడుదల కాలేదు. పీజీ రిజల్స్ వచ్చి పది రోజులు దాటుతోంది.
 
 విద్యార్థులు సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల చుట్టూ తిరుగుతున్నారు. ఈ శాఖల అధికారులు ట్రెజరీలకు విద్యార్థుల వివరాలు తెలియజేశామని వారి అకౌంట్లలో డబ్బులు పడతాయని అంటున్నారు. ట్రెజరీ అధికారులు మాత్రం నిధులు తమకు చేరలేదని చెబుతున్నారు. ప్రస్తుతం రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కోసం బీసీ, ఈబీసీ విద్యార్థులు 189, ఎస్సీ విద్యార్థులు 133 మంది ఎదురుచూస్తున్నారు. ఎల్‌ఎల్‌బీ వంటి కోర్సు పూర్తి చేసు కున్న విద్యార్థులు బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలంటే ధ్రువీకరణ పత్రం అవసంరం. ఉపాధికి అవకాశం ఉన్న ఎంబీఏ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, గణితం వంటి పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు సైతం జాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు మంజూరు కోసం వారంతా ఎదురుచూపులు చూస్తున్నారు.
 
 ఉన్నతాధికారులకు తెలియజేశాం..
 ఈ సమస్యపై ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలియజేశాం. రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విద్యార్థుల అకౌంట్‌లోనే నమోదవుతాయి. వర్సిటీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ముందుగా విద్యార్థుల నుంచి బకాయిల సొమ్ము వసూలు చేస్తున్నాం.
 - రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, బీఆర్‌ఏయూ
 

మరిన్ని వార్తలు