స్నేహితుని పెళ్లికొచ్చి..

23 Aug, 2013 05:48 IST|Sakshi

సిద్దవటం, న్యూస్‌లైన్: స్నేహితుని వివాహానికి సిద్దవటానికి వచ్చి పక్కనే ఉన్న పెన్నానదిలో ఈత ఆడేందుకు వెళ్లి పన్‌రెట్టి భువనేశ్వరరావు(22) గురువారం మృతిచెందాడు. చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన పన్‌రెట్టి భువనేశ్వర్‌రావుతోపాటు మరో తొమ్మిదిమంది కలిసి మేడెం శివప్రసాద్ అనే స్నేహితుని వివాహానికి వచ్చారు. వివాహం అనంతరం పెన్నానది లోలెవల్ కాజ్‌వే సమీపంలో ఉన్న నదిలోకి ఈతకు వెళ్లారు. వంతెనకు సమీపంలో గుంతలోకి దిగిపోవడంతో భువనేశ్వరరావు స్నేహితులకు కనిపించలేదు.
 
 స్నేహితులు గాలింపుచర్యలు చేపట్టగా అతని కాలు తగలడంతో పట్టుకుని లాగారు. అప్పటికే ఆ యువకుడు మృతి చెంది ఉండటం స్నేహితులను కలిచివేసింది. వారు బోరున విలపించారు. సమాచారాన్ని అతని తండ్రికి చేరవేశారు. తండ్రి గోవిందయ్య టీటీడీలో ఉద్యోగి కాగా తల్లి కళావతి గృహిణి. మృతుడు తిరుపతి రాయలసీమ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. ఇతనికి అక్క, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ గురునాథ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

మరిన్ని వార్తలు