‘విజిలెన్స్‌’ డీజీగా గౌతమ్‌ సవాంగ్‌

8 Jul, 2018 03:23 IST|Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ పోలీసు కమిషనర్‌ డి.గౌతం సవాంగ్‌ రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునితా ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్‌ విభాగంతోపాటు సవాంగ్‌ ప్రభుత్వ ఎక్స్‌–అఫీషియో ముఖ్యకార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు.

గౌతం సవాంగ్‌ 2015 ఆగస్టు 2న విజయవాడ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడేళ్లపాటు ఇక్కడ విధులు నిర్వర్తించారు. ఇటీవల డీజీపీ పదవి రేసులో కూడా చివరి వరకు ఆయనే ఉన్నారు. కానీ చివరి నిమిషంలో ఠాకూర్‌ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. అప్పటి నుంచి కినుక వహించిన సవాంగ్‌ మౌనంగా ఉన్నారు. రెండు రోజుల కిందటే సీఎంను సవాంగ్‌ కలిశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు శనివారం నాడు బదిలీ ఉత్తర్వులు రావడం చర్చనీయాం శమైంది. 

మరిన్ని వార్తలు