బ్లాక్ మార్కెట్ నిజరూపాన్ని బయటపెట్టండి

16 Oct, 2014 01:23 IST|Sakshi
బ్లాక్ మార్కెట్ నిజరూపాన్ని బయటపెట్టండి

విశాఖ పర్యటనలో అభిమానులకు పవన్ కల్యాణ్ పిలుపు

విశాఖపట్నం సిటీ: సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుందామనుకునే అక్రమ వ్యాపారస్తుల నిజరూపాన్ని బయటపెట్టాలని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు బుధవారం విశాఖలోని ఫిషింగ్ హార్బర్, పెదజాలారీ పేటల్లో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కష్టకాలంలో ఉన్నపుడు ప్రజలకు సేవ చేయాలేగానీ ధరలు పెంచి దోపిడీ చేయడం మహా పాపం అన్నారు. నిత్యావసరాలను అక్రమ మార్గాలకు మళ్లించొద్దని అలాంటివి చేస్తే అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తుపాను బాధితుల కష్టాలను ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సాయం అందించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎంపీ కంభంపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు