వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి పిలుపు
స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణుల కృషి ప్రశంసనీయం
నరసరావుపేట వెస్ట్, న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫైనల్ ఎన్నికలుగా పిలవబడే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 16న పార్టీ అభ్యర్థులు నామినేషన్ల వేసే ప్రక్రియను పురస్కరించుకొని ప్రకాష్నగర్లోని శుభం ఫంక్షన్ ప్లాజాలో గురువారం నిర్వహించిన కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ అనుకోకుండా మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎదుర్కోవాల్సివచ్చినా పార్టీ శ్రేణులు కష్టపడి బాధ్యతగా పనిచేశాయన్నారు. అక్కడక్కడ చిన్నచిన్న లోపాలు కన్పించినా జరిగిన ఎన్నికల్లో చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను వైఎస్సార్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకోవటం ఖాయమని హర్షధ్వానాల మధ్య చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీనవర్గాల పార్టీ అని, అధికారంలోకి వస్తే వారంతా ఆ పార్టీ నీడన చల్లగా ఉంటారన్నారు.
మన పార్టీకి అండగా ఉన్న పేదవర్గాలు భయబ్రాంతులకు గురికాకుండా వారికి అండగా ఉండి ఓట్లు వేయించాలని కోరారు. తెలుగుదేశం, బీజేపీల పొత్తు అనైతికమని విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ నాయకుడు మిట్టపల్లి వెంకటకోటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో 26 నుంచి 28 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్రలో 125 స్థానాలు సంపాదించి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వైఎస్పై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవాలని కార్యకర్తలకు హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే వైఎస్ జగన్మోహనరెడ్డి పార్టీ పెట్టారని చెప్పారు.
మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్బారెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి వార్డులో కార్యకర్తలను అప్రమత్తం చేయాలన్నారు. పార్టీ పట్టణ కన్వీనర్ ఎస్ఏ హనీఫ్ అధ్యక్షత వహించగా.. రొంపిచర్ల, నరసరావుపేట మండల కన్వీనర్లు పిల్లి ఓబుల్రెడ్డి, కె.శంకరయాదవ్, పట్టణ మహిళా కన్వీనర్ ఎస్.సుజాతాపాల్ తదితరులు పాల్గొన్నారు.