ఆదిలాబాద్ రూరల్, న్యూస్లైన్ :18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని కలెక్టర్ అహ్మద్ బాబు సూచించారు. బుధవారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు నమోదు, సవరణపై సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కళాశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మీసేవా కేంద్రా ల్లో అవసరమైన ఫారాలు అందుబాటులో ఉం టాయని తెలిపారు. ఓటర్ల సవరణ జాబితాను 6 జనవరి 2014న ప్రచురిస్తామని, ముసాయిదా జాబితాను 3 అక్టోబర్ 2013న ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఫిర్యాదులు అక్టోబర్ 3 నుంచి 31 వరకు స్వీకరిస్తామని, ఇదే నెలలో 6, 13, 20, 27 తేదీల్లో బూత్ స్థాయి ఏజెంట్ల నుంచి క్లైమ్లు, అభ్యంతరాలను స్వీకరించి నవంబర్ 30న పరిష్కరిస్తామని చెప్పారు.
డిసెంబర్ 26 నాటికి పూర్తి సమాచారాన్ని పొందుపరిచి ఫొటోలతో జాబితా సిద్ధం చేస్తామన్నారు. జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గసభ్యుల పరిధిలో 2,137 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఓటర్ల పెంపుతో 225 పెరిగి సంఖ్య 2,362 చేరిందని చెప్పారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సూచనలు, అభ్యంతరాలు సమర్పిస్తే చర్యలు చేపడుతామన్నారు. సమావేశంలో డీఆర్వో ఎస్ఎస్ రాజు, నాయకులు నర్సింగ్రావు, గొడాం నగేష్, బి.గోవర్ధన్, దత్రాత్తి, ఎం.ప్రభాకర్రెడ్డి, లక్ష్మణ్, ఓంకార్ శర్మ, ఎన్నికల పర్యవేక్షకుడు ప్రభాకర్స్వామి పాల్గొన్నారు.