రైతు దినోత్సవానికి సర్వం సిద్ధం

8 Jul, 2019 10:45 IST|Sakshi
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి 

రైతుల పంపిణీ కోసం తెచ్చిన వ్యవసాయ సామగ్రి

భారీగా బందోబస్తు ఏర్పాట్లు

సాక్షి, జమ్మలమడుగడు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర రైతు దినోత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతు దినోత్సవ కార్యక్రమాన్ని సొంత జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడంతో సోమవారం పట్టణంలోని ముద్దనూరు రహదారిలో పనులను వేగ వంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే  సభాప్రాంగణం పూర్తి చేయడంతోపాటు రైతులకు సంబంధించిన పరికరాల పంపిణీ కోసం, వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి, ఎమ్మెల్యేలు, నాయకులు 


సీఎం సభకు భారీగా వస్తారని అంచనాతో.. 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారి జిల్లాకు వస్తుండటంతో భారీగా ప్రజలు, రైతులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అదే స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతులకు, మహిళలకు, ప్రజలకు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేయించారు. వర్షం పడినా  సభకు అంతరాయం కలుగకుండ రేకుల షెడ్‌లతో కూడిన సభావేదికను తీర్చిదిద్దారు.

భారీగా బందోబస్తు..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు దినోత్సవ సభకు హాజరవుతుండటంతో పాటు జిల్లాలోని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, వ్యవసాయాశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మిధున్‌రెడ్డిలతోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు కర్నూల్‌ జిల్లాలోని బనగానపల్లి, ఆళ్లగడ్డ, అనంతపురం జిల్లా నుంచి తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు సైతం ఈ సభకు హాజరవుతుండటంతో పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు