ట్యాక్స్ చెల్లించాలంటే హిజ్రాలు రావలసిందేనా ?

19 Feb, 2015 12:32 IST|Sakshi
ట్యాక్స్ చెల్లించాలంటే హిజ్రాలు రావలసిందేనా ?

ఆస్తి, నీటి... పన్నులు సకాలంలో చెల్లిస్తే పౌర సేవలు సత్వరం అందించేందుకు నగరపాలక సంస్థలు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాయని ఉన్నతాధికారులు  చెబుతూనే ఉంటారు. మధ్య తరగతి వారు పన్నులు చెల్లించకపోతే నయానో భయానో బెదిరిస్తే చాలు సదరు పన్నులు ఒక రోజు ఆలస్యంగా అయినా కడుతుంటారు. అదే కోట్లకు పడగలెత్తిన వారు మాత్రం పన్నులు కట్టేందుకు ముందుకు రావడం లేదు. భవనాలు సీజ్ చేస్తామని, నల్లా కనెక్షన్ కట్ చేస్తామని, భవనాలు స్వాధీనం చేసుకుంటామని... బెదిరించినా  బడాబాబులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

దాంతో వారి నుంచి రావాల్సిన పన్ను బకాయిలు కోట్లాది రూపాయిలు కొండలా పేరుకుపోయాయి. కోట్లలో బకాయిలు పడ్డ  పన్నులు వసూలు చేసేందుకు కార్పొరేషన్ ఓ ఐడియాను అమలు చేసింది. ఇందు కోసం 'చెత్త డబ్బా'నే వాడుకుంది. జీహెచ్ఎంసీకి భారీగా బకాయిలు చెల్లించాల్సిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ల గుమ్మం ముందు ఏకంగా పెద్దపెద్ద చెత్త డబ్బాలను పెట్టింది. దీంతో సిగ్గు పడి కొంతమంది ఈ 'చెత్త' గోల ఎందుకని పన్నులు చెల్లిస్తుంటే...మరికొందరు ఇది మామూలే అని దులిపేసుకుంటున్నారు. దాంతో పన్నుల కోసం వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులను చెత్తడబ్బా కూడా వర్క్ అవుట్ కాకపోవటంతో నీరసపడిపోతున్నారు.

ఇదే విషయంలో పొరుగు రాష్ట్రం తమిళనాడులోని చెన్నై నగర పాలక సంస్థ ఓ అడుగు ముందుకేసింది. మొండి బకాయిల వసూలు కోసం వినూత్న పద్థతిని అమల్లో పెట్టింది. కార్పొరేషన్కు పన్ను ఎగవేసిన బడాబాబుల భారీ కాంప్లెక్స్లు, ఎస్టేట్ల ఎదుట హిజ్రాలతో గానా భజాన పెట్టింది. దీంతో హిజ్రాల దెబ్బకు దిమ్మదిరిగిన బడాబాబులు పన్ను చెల్లించేందుకు చెన్నై కార్పొరేషన్కు క్యూ కడుతున్నారు.


పన్నులు కట్టండి అని నయానో భయానో చెప్పిన దారికి రాని బాబులు హిజ్రాల దెబ్బకు దిగిరావడంతో చెన్నై కార్పొరేషన్ అధికారులకు ఆనందం అవధులు లేకుండా పోయింది.  దీంతో బడాబాబుల నుంచి పన్నులు వసూళ్ల కోసం చెన్నై మున్సిపల్ కార్పొరేషన్.. హిజ్రాలను కాంట్రాక్ట్పై నియమించినట్లు సమాచారం. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా చెన్నైలో అమలు చేసిన టెక్నిక్ను మనం కూడా అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. చెత్తడబ్బాతో కాని పని హిజ్రాల దెబ్బతో అయినా పన్నులు వసూలు అయితే చాలనుకుంటున్నారు సదరు అధికారులు.

మరిన్ని వార్తలు