ప్రేమించిన యువకుడిపై కత్తితో దాడి

25 May, 2020 21:49 IST|Sakshi

సాక్షి, కృష్ణా: ప్రేమించిన యువకుడిపై ఓ యువతి కత్తితో దాడి చేసింది. ఈ ఘటన జిల్లాలోని చల్లపల్లి మండలం వక్కలగడ్డలో చోటు చేసుకుంది. అనంతరం దాడికి పాల్పడ్డ యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిని స్థానికులు మచిలీపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంకు చెందిన యువతి మాగంటి నాగలక్ష్మి ఆర్కే కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. గూడూరు గ్రామానికి చెందిన గొరిపర్తి పవన్ కుమార్ పెడన తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఇరువురి మధ్య గత రెండేళ్లుగా పరిచయం ఉంది. 

‘వివాహం చేసుకోవాలని నాగలక్ష్మి తనపై ఒత్తిడి తెస్తోంది. చివరి సారిగా ఒకసారి కలిసి మాట్లాడుకుని విడిపోదామని చెబితే సోమవారం ఉదయం వక్కలగడ్డ వచ్చాను. నేను పెళ్లికి ఒప్పుకోకపోవటంతో ఇద్దరం కలిసి చనిపోదామంటూ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా నాపై కత్తితో దాడి చేసింది’ అని పవన్ కుమార్‌ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు