బాలిక కిడ్నాప్‌నకు విఫలయత్నం

5 Jan, 2014 04:28 IST|Sakshi

వింజమూరు, న్యూస్‌లైన్ : ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు నలుగురు విఫలయత్నం చేసిన సంఘటన మండలంలోని వింజమూరు-చాకలికొండ రోడ్డు మార్గంలో శనివారం చోటు చేసుకుంది. మరో బాలిక కిడ్నాప్‌నకు గురైనట్టు తెలుస్తోంది. బాధితురాలి కథనం మేరకు..మండలంలోని బత్తినవారిపల్లికి చెందిన కనియంపాటి యమున వింజమూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది.
 
 రోజు మాదిరిగానే ఆటోలో పాఠశాలకు వెళ్లేందుకు బత్తినవారిపల్లిలో వేచి ఉండగా ఇంతలో ఒక ఆటో రావడంతో ఆ బాలిక అందులో ఎక్కింది. ఆటోలో ఓ మహిళ, ముగ్గురు యువకులు ఉన్నారు. వారి మధ్యలో మరొక బాలికకు ముసుగు వేసి ఉంది. అయితే కాళ్లు మాత్రం కనిపిస్తున్నాయి. పరిస్థితిని యమున గమనించి అనుమానించింది. ఇదే సమయంలో యమునను కూడా అందులోని వారు చాక్లెట్టు తినమని కోరగా తిరస్కరించింది. తినమని బలవంత పెట్టారు. యమున ప్రతిఘటించడంతో మాధవనగర్ సమీపంలో వదిలి వెళ్లారు. బాలిక జరిగిన ఉదంతాన్ని మాధవనగర్‌లోని స్థానికులకు తెలపగా వారు మరో ఆటోలో పాఠశాలకు పంపారు. అయితే ఇదే ఆటోలోని మరో బాలిక కిడ్నాప్‌కు గురైట్టు అనుమానం తలెత్తింది. ఆ బాలిక ఎవరనేది తెలియరాలేదు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.
 

మరిన్ని వార్తలు