ప్రేమించానన్నాడు.. పెళ్లి అంటే వద్దంటున్నాడు

13 Oct, 2018 09:09 IST|Sakshi
పవన్, యువతి కలిసి దిగిన ఫొటో(ఫైల్‌)

న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు బాధితురాలి బైఠాయింపు 

సాక్షి, పత్తికొండ టౌన్‌: ‘మూడేళ్లుగా ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకోమంటే ఇపుడు వద్దంటున్నాడు. న్యాయం చేయండి’ అంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముం దు బైఠాయించిన ఘటన శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగింది. యువతి, ఆమె బంధువులు తెలిపిన వివరాలు.. పత్తికొండకు చెందిన పవన్‌ హైదబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన యువతి బీటెక్‌ చదివి ఇంటివద్దే ఉంటోంది. రైలు ప్రయాణంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి అనంతరం ప్రేమకు దారితీసింది. మూడేళ్లుగా వీరి ప్రేమ కొనసాగింది. పెళ్లి›చేసుకుందామని యువతి ప్రస్తావన తీసుకురావడంతో పవన్‌ అంగీకరించకపోవడంతో పాటు 10 నెలల నుంచి కలవకుండా, ఫోన్‌లో స్పందించకుండా దూరం పెట్టాడు.

 ఈ విషయమై వారం రోజుల క్రితం పత్తికొండకు బంధువులతో కలసి వచ్చిన యువతి.. పవన్‌ తనను పెళ్లి చేసుకోవాలని పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టింది. పంచాయతీలో పవన్, వారి బంధువులు అంగీకరించకపోవడంతో న్యాయం చేయాలని కోరుతూ గురువారం ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. సమాచారం తెలుసుకున్న పవన్, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసుసిబ్బంది యువతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. సీఐ కృష్ణయ్య యువతి, వారి బంధువులతో మాట్లాడారు. పవన్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇస్తామని, పెళ్లికి అంగీకరించకపోతే కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.   

మరిన్ని వార్తలు