బంగారు ఆభరణాలు స్వాధీనం

25 Mar, 2019 08:47 IST|Sakshi

సాక్షి,విజయనగరం టౌన్‌:  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో  ఎన్నికల తాయిలాలు జోరు పెరిగిపోతుంది.  మరికొద్ది రోజుల్లో  ఎన్నికలు జరగనుండడంతో నాయకులు  ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనేక రకాలైన ఆకర్షణ వస్తువులను తాయిలాలుగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్‌ శాఖ  ముందస్తు తనిఖీలను ముమ్మరం చేసింది.  జిల్లా వ్యాప్తంగా సుమారు 50 చోట్ల ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. మండల కేంద్రాల్లోనూ, పట్టణ ప్రధాన ప్రాంతాల్లో  నిఘా పటిష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం  స్థానిక గంటస్తంభం ప్రాంతంలో  సీసీఎస్‌ పోలీస్‌ బృందం చేపట్టిన తనిఖీల్లో  సుమారు  రూ.70 లక్షలు విలువైన బంగారు ముక్కుపుడకలు, బిస్కెట్లు, రింగులను గుర్తించినట్టు  ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ స్పష్టం చేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌ నుంచి వచ్చిన మన్‌దీప్‌ సింగ్, జగ్జీత్‌సింగ్‌ల వద్ద నుంచి బంగారు ఆభరణాలు,  రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.  అయితే ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు  ముక్కు పుడకలు తయారుచేసేందుకు ఒప్పందం చేసుకున్నట్టు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.  మరింత లోతుగా విచారణ చేపట్టి,  బాధ్యులెవరని తేలితే వారిపై  కేసులు నమోదు చేస్తామన్నారు.  జీఎస్‌టీ డిప్యూటీ కమిషనర్‌ చంద్రకళ  బంగారం ఎక్కడ నుంచి తెస్తున్నది, దానికిగల బిల్స్‌ను పరిశీలిస్తున్నారన్నారు.   సీసీఎస్‌ డీఎస్పీ పాపారావు,  ఎస్‌ఐ రాజా సుబ్రహ్మణ్యం, కిరణ్‌కుమార్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు