రవ్వంత బంగారం కొండంత సింగారం

16 Nov, 2018 08:36 IST|Sakshi

వన్నె పెరిగిన ఒక గ్రాము బంగారు ఆభరణాలు

ఆకర్షణీయ డిజైన్‌లతో గోల్డ్‌ కవరింగ్‌ నగలు

అందుబాటు ధరలతో మక్కువ చూపుతున్న మహిళలు

దానవాయిపేట (రాజమహేంద్రవరం సిటీ): మార్కెట్‌లో పసిడి అభరణాల ధగధగలతో పాటు, ఒక గ్రాము బంగారు ఆభరణాల డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త నమూనాలతో పాటు వివిధ రకాలైన రాళ్లతో పొదిగిన గోల్డ్‌ కవరింగ్‌ నగలు మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక గ్రాము గోల్డ్‌ అభరణాలలో  సీజే స్టోన్స్, యాంటీ జ్యూయలరీ, మ్యాట్‌ పాలిష్, టెంపుల్‌ జ్యూయలరీ వంటి విభాగాల్లో పలు రకాల వడ్డాణాలు, రాళ్ల గాజులు, హారాలు, నెక్లెస్‌లు, చోకర్లు, రాళ్ల ఉంగరాలు, ప్రత్యేకమైన జోడా సెట్లు, పాపిడి చైన్‌లలో వివిధ రకాల డిజైన్లు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు బ్రైడల్‌ సెట్లు, పండగలు ప్రత్యేక పర్వదినాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన జ్యూయలరీతో పాటు, ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకమైన ఆభరణాలు, కిరీటాలు, భరతనాట్యం, కుచిపూడి వంటి నృత్య కళాకారులకు అవసరమైన జ్యూయలరీ సరసమైన ధరలకు అందుబాటులోకి రావడంతో ఒక గ్రాము బంగారు ఆభరణాలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది.

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి
మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పలు రకాల ఆభరణాలను రాజస్థాన్, కోల్‌కతా, ముంబాయి, దాదర్, ఢిల్లీ, ఆగ్రా, రాజ్‌కోట్, మంచిలీపట్నం వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఒక గ్రాము గోల్డ్‌ కవరింగ్‌ నగలు రూ.వంద నుంచి రూ.5 వేల వరకు అందుబాటులో ఉన్నాయని, వీటిపై వస్తుసేవల పన్ను (జిఎస్‌టీ) 3 శాతం నుంచి 12 శాతం వరకు అమల్లో ఉందని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వివిధ రకాల డిజైన్లుఅందుబాటులోకి వచ్చాయి
బంగారం కంటే ఎక్కువ రకాల మోడళ్లు, వివిధ రకాల డిజైన్లు, ఒక గ్రాము బంగారు అభరణాల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రతి నగకూ ఆరు మాసాల గ్యారెంటీ ఉన్నప్పటికీ కనీసం ఏడాది వరకూవీటి వన్నె తగదు. సామాన్య, మధ్య తరగతి మహిళలు వీటిని ధరించేందుకు మక్కువ చూపిస్తున్నారు.– బెజవాడ వెంకటేశ్వరావు(బాబు ఫ్యాన్సీ సెంటర్‌ అధినేత)

మరిన్ని వార్తలు