దూదిగింజలు.. కాసుల గలగలలు..

30 Nov, 2013 06:31 IST|Sakshi

భైంసా, న్యూస్‌లైన్ :  ఆదిలాబాద్ జిల్లా తెల్లబంగారానికి పెట్టింది పేరు. ఏటా లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది. రూ.కోట్ల వ్యాపారం జరుగుతోంది. వ్యాపారులు పత్తిని మార్కెట్‌లో కొనుగోలు చేసి నేరుగా జిన్నింగ్ మిల్లులకు పంపిస్తారు. అక్కడ  దూది, దూది గింజలను వేరు చేస్తారు. దూదితో బేళ్లు తయారు చేసి బట్టల మిల్లులకు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి అవుతాయి. మరి దూది గింజలు కూడా క్వింటాళ్ల కొద్ది వస్తాయి. వీటిని సాల్వెంట్ మిల్లులకు పంపిస్తారు. ఈ గింజలతో అక్కడ నూనె, పశువులదాణా(కల్లీ), వ్యర్థాలు(మడ్డ)లు వేరు చేస్తారు.
 క్వింటాలు గింజల నుంచి..
 క్వింటాలు పత్తిలో దూది దాదాపు 38 కిలోలు, గింజలు దాదాపు 62 కిలో లు వస్తాయి. క్వింటాలు దూది గింజల్లో పది శాతం వృథా అవుతాయి. ఇందులో 8 శాతం నూనె, 82 శాతం పశువులదాణా(కల్లీ) తయారవుతుం ది. దూది గింజల ద్వారా వచ్చే నూనెను కిలో రూ.61 చొప్పున ట్యాంకర్ల ద్వారా హైదరాబాద్, గుజరాత్‌లోని ఆయిల్ రిఫైనరీ కేంద్రాలకు ఎగుమతి అవుతాయి. క్వింటాలు దూది గింజల నుంచి వచ్చే ఎనిమిది కిలోల నూనె విలువ రూ.488 ఉంటుంది. పశువుల దాణ అయితే ప్రస్తుతం క్వింటాలు ధర రూ.1,350 పలుకుతోంది. క్వింటాలు గింజల నుంచి ఆయిల్ మిల్లుల ద్వారా వచ్చే 82 కిలోల పశువులదాణాద్వారా రూ.1,107 వ్యాపారులకు వస్తుంది. ఇలా మిల్లులో తయారయ్యే నూనె నుంచి వచ్చే వ్యర్థాలు(మడ్డ)ను వ్యాపారులు కొనుగోలు చేస్తారు. క్వింటాలు గింజల నుంచి ఆరు నుంచి ఎనిమిది కిలోల మడ్డా వస్తుంది. ఈ మడ్డా కిలో రూ.7 నుంచి రూ.8 వరకు పలుకుతుంది. మడ్డా నుంచి కూడా రూ.50 మేర వస్తాయి. కాగా, మడ్డాను సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.
 ఆయిల్ మిల్లులో ఇలా...
 రూ.5 లక్షలతో ఒక ఆయిల్ మిల్లు యంత్రాన్ని బిగించుకోవచ్చు. ఫ్యాక్టరీ ల్లోనూ ఆయిల్ మిల్లు షెడ్లలో యంత్రాలు 4 నుంచి 32 వరకు ఉంటాయి. ఒక్కో యంత్రం గంటకు ఆరు క్వింటాళ్ల దూది గింజలను నూర్పిడి చేస్తుం ది. పత్తి సీజన్‌లో 24 గంటల పాటు ఒక్కో యంత్రం 150 క్వింటాళ్ల మేర దూది గింజలను నూర్పిడి చేస్తాయి. ఇలా ఫ్యాక్టరీ యజమాని నెలకొల్పిన సంఖ్యను బట్టి మిల్లుల్లో దూది గింజలు ఏరోజుకు ఆ రోజు నూర్పిడి అవుతాయి.
 

మరిన్ని వార్తలు