- రైలు కింద పడి మహిళ మృతి
గూడూరు టౌన్: తాగునీటి కోసం ఫ్లాట్ఫాంపై దిగిన ఓ మహిళ తిరిగి ఎక్కే సమయంలో రైలు కదలడంతో అదుపుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గూడూరు రైల్వేస్టేషన్లో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు..పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యాగూడేనికి చెందిన చిన్నం హేమలత(57) దీపావళి సందర్భంగా చెన్నైలో ఉంటున్న కుమార్తె ధనలక్ష్మి, మనుమరాలితో కలిసి గుజరాత్లోని ఉంటున్న భర్త గాంధీ వద్దకు వెళ్లింది.
అనంతరం కుమార్తె, మనుమరాలిని చెన్నైలో వదిలిపెట్టేందుకు నవజీవన్ ఎక్స్ప్రెస్లో వెళుతోంది. ఈ క్రమంలో రైలు గూడూరు రైల్వేస్టేషన్లో ఆగడంతో మంచినీటి కోసం హేమలత దిగింది. నీళ్లు పట్టుకుని తిరిగి ఎక్కే సమయంలో రైలు కదలడంతో దాని కిందపడే కన్నుమూసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైల్వే ఎస్సై వరప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.