లాక్‌డౌన్‌లో పోలీసుల పనితీరు భేష్

6 Jul, 2020 04:33 IST|Sakshi

కోవిడ్‌పై పోరాటంలో ఏపీ దేశంలోనే టాప్‌

466 మంది పోలీసులు కరోనా బారిన : డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

సాక్షి, విశాఖపట్నం: కరోనా కష్టకాలంలో పోలీసుల పనితీరు అద్భుతమని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 24 గంటలూ విధులు నిర్వహించారని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 78 వేల మంది పోలీస్‌ సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. విశాఖ నగర పోలీస్‌ కమిషనరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో అధికారులతో రెండురోజులు సమావేశాలు నిర్వహించామని,  ప్రధానంగా మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీస్‌ శాఖ అప్రమత్తత గురించి చర్చించామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

► కోవిడ్‌పై పోరాటంలో మన రాష్ట్రం దేశంలోనే ప్రత్యేకంగా నిలిచింది.  
► ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 466 మంది పోలీసులకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.  
► దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో అప్రమత్తంగా ఉన్నాం. 
► ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సాగును మావోయిస్టులే ప్రోత్సహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ కేంద్రంగా దాని రవాణాను అరికడుతున్నాం. 
► కాపులుప్పాడ ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా చెప్పడమనేది అవాస్తవం. గ్రేహౌండ్స్‌ పోలీసులకు ట్రైనింగ్, ఆపరేషన్స్‌కు అనుకూల ప్రాంతాలను చూశాం.
► ఆనందపురం జగన్నాథపురం గ్రామాల్లో కేటాయించిన 385 ఎకరాల స్థలాన్ని గ్రేహౌండ్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు పరిశీలించాం. 
► విశాఖ జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సగానికి పైగా రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగాం. దీంతో పాటు నగరంలో క్రైమ్‌ రేటు కూడా బాగా తగ్గింది. 
► ఈ కార్యక్రమంలో సీపీ రాజీవ్‌కుమార్‌ మీనా, రేంజ్‌ డీఐజీ ఎల్‌.కె.వి రంగారావు, రూరల్‌ ఎస్పీ బి. కృష్ణారావు, డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగి, డీసీపీ (క్రైం) సురేష్‌బాబు, ఎస్‌ఈబీ ఏఎస్పీ అజిత వేజెండ్ల తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు