ఎదురు చూపులేనా?

9 Sep, 2019 09:55 IST|Sakshi
పదవ తరగతి విద్యార్థులు 

సాక్షి, కడప : పదవ తరగతి పరీక్షల్లో కార్పొరేట్‌ అక్రమాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రశ్నపత్రంలో సమూలు మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న 20 శాతం అంతర్గత మార్కులను రద్దు చేసి దానిస్థానంలో ఏకవాక్య ప్రశ్నలు పెట్టనుంది. ఫలితంగా అక్రమాలకు కొంత అడ్డుకట్ట పడనుంది. విద్యార్థుల సమార్థ్యాల మేరకు ప్రశ్నాపత్రం ఉండబోతోందని చర్చసాగుతోంది. అది కూడా వంద మార్కుల ప్రశ్నపత్రం రూపుదిద్దుకుంటున్నట్లుగా తెలిసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలులోకి తీసుకొచ్చేందుకు విద్యాశాకాధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎస్‌సీఈఆర్టీ పది నమూనా ప్రశ్నపత్రాన్ని విడుదల చేయలేదు. దీంతో ప్రశ్నాపత్రం ఏవిధంగా ఉంటుందోనని విద్యార్థులు వారి తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీరితోపాటు నమూనా ప్రశ్నాపత్రం కోసం జిల్లావ్యాప్తంగా దాదాపు  38 వేలమంది విద్యార్థులు ఎదురు చేస్తున్నారు. పైగా నవంబర్‌ మొదటి వారంలో సమ్మెటీవ్‌– 1  పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన సిలబస్‌ కానీ మాదిరి  ప్రశ్నపత్రాలను కానీ  పంపలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

100 మార్కుల ప్రశ్నపత్రం.. 
జిల్లావ్యాప్తంగా ప్రతి ఏటా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 38 వేల మంది దాకా విద్యార్థులు పది పరీక్షలను రాస్తున్నారు. అయితే గ్రేడింగ్‌ల సాధనలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ముందు వరుసలో ఉంటున్నారు. అంతర్గత మార్కులు పాఠశాల యాజమాన్యాలు వేసుకునే వెసలుబాటు ఉన్న నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యాలతో పనిలేకుండా ర్యాంకుల కోసమని అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గత పాలకులు కార్పొరేట్‌ శక్తులను ప్రోత్సహించగా వారు సాగించిన వ్యవహారంతో విద్యాశాఖ భ్రష్టుపట్టింది. రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టిని సారించి ప్రక్షాళన చేపట్టారు.

ఇందులో భాగంగా పరీక్షల నిర్వహణలో సమూల మార్పులను చేపట్టారు. అంతర్గత మార్కులను  రద్దు చేసి ఇక నుంచి వంద మార్కులతో కూడిన ప్రశ్నాపత్రం విద్యార్థులకు ఇవ్వనున్నారు. బిట్‌ పేపర్‌ కూడా రద్దుకానుంది. దానిస్థానంలో ఏకవాక్య సమాధానాలు రాసే విధంగా ప్రశ్నలు ఇవ్వనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన నమూనా పేపర్‌ను మాత్రం ఎస్‌సీఈఆర్టీ ఇంత వరకు ఇలా ఉంటుందని మాత్రం నమూనా ప్రత్రాన్ని విడుదల చేయలేదు. దీంతో సిలబస్‌ ఎలా ఉం టుందో.. పిల్లలకు ఎంతమేరకు బోధనలు అం దించాలి అనే దానిపై ఉపాధ్యాయులకు కూడా స్పష్టత లేదు. దీంతో అటు విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 

రెండు పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించాల్సిందే..  
పదవ తరగతిలో ఇప్పటి వరకు రెండు పేపర్లలో కలిసి ఆయా సబ్జెక్టుల్లో 35 మార్కులు సాధిస్తే విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేవారు. ఒక దానిలో సున్నా మార్కులు వచ్చినా రెండో పేపర్‌లో 35 మార్కులు వస్తే ఆ సబ్జెక్టు 35 మార్కులు వస్తే ఆ సబ్జెక్టు పాస్‌ అయినట్లుగా పరిగణించేవారు. ఇక నుంచి రెండు పేపర్లలోనూ నిర్ణయించిన మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధించినట్లుగా మార్పులు చేసినట్లు తెలిసిందే. అంటే 50 మార్కులకుగాను ఒకొక్క పేపర్‌లో 17.5 మార్కులు ఖచ్చితంగా రావాల్సిందేనని సూచించారు. ఇందుకు సంబంధించి సిలబస్, నమూనా ప్రశ్నాపత్రం ఇలా ఉంటుందని మాత్రం ఇంతరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

మూడు నెలలు గడిచినా.. 
పదవ తరగతి అంతర్గత మార్కులను రద్దు పరుస్తూ మార్చి 2020 సంవత్సరంలో కొత్త పద్దతిలో పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యా కమీషనర్‌ జూన్‌ నెలలో ప్రకటించారు. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు అయినప్పటికీ కొత్త మోడల్‌ పేపర్‌ ప్రకటించకపోవడం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పనితీరుకు నిదర్శనం. నవంబర్‌ మొదటి వారంలో నిర్వహించే సమ్మెటీవ్‌ పరీక్షా ప్రతాలు ఏ మాదిరిగా ఉంటాయో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే నూతన మోడల్‌ పేపర్‌ మరియు బ్లూ ఫ్రింట్‌ ప్రకటించాలి.  
 – జీవీ నారాయణరెడ్డి, డీసీఈబీ సెక్రటరీ, కడప

మరిన్ని వార్తలు