-

అభివృద్ధికి చంద్రబాబు సహకరించాలి

3 Mar, 2020 12:55 IST|Sakshi

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, కడప: చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బీసీల ఓటు బ్యాంకుతో గెలిచిన చంద్రబాబు.. వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలు, దళితులకు మంచి చేయకపోగా వారిని మోసం చేయడం దారుణమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి యోచిస్తే.. దాన్ని టీడీపీ అడ్డుకుందని ధ్వజమెత్తారు. చంద్రబాబులా బీసీలను వైఎస్‌ జగన్‌ వాడుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి కి చంద్రబాబు సహకరించాలని శ్రీకాంత్‌ రెడ్డి కోరారు. (బీసీల ఎదుగుదల ఓర్చుకోలేకపోతున్నారు)

రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదని.. రాష్ట్రానికి నిధులు రాకూడదన్నదే చంద్రబాబు దురుద్దేశ్యమని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. అమ్మ ఒడి, ఇంటి వద్దకే పింఛన్‌ పంపిణీ, రైతు భరోసాతో రికార్డు సృష్టించామని తెలిపారు.  ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో రాబోయే నాలుగేళ్లలో జిల్లాను,రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఆయనకు మాట్లాడే అర్హత లేదు: సురేష్‌బాబు
బీసీలను మోసం చేసింది చంద్రబాబేనని.. వారి గురించే మాట్లాడే అర్హత ఆయనకు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలని నిరంతరం సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును బీసీలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలు జరగకూడదనే దురుద్దేశ్యంతో తన అనుచరులతో కోర్టులో స్టే తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడు జైలుకెళ్లక తప్పదని సురేష్‌బాబు పేర్కొన్నారు. (చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం)

మరిన్ని వార్తలు