ప్రభుత్వ కాలేజీలే బెటర్..!

29 Apr, 2015 05:20 IST|Sakshi
ప్రభుత్వ కాలేజీలే బెటర్..!

ప్రైవేటుతో పోటీగా 69 శాతం ఉత్తీర్ణత మెరిట్ విద్యార్థులతో
ప్రైవేటులో ఫలితాలు అంతంతే!     
సౌకర్యాలు కల్పిస్తే మరింత సత్తా చాటే అవకాశం       

 
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో ప్రభుత్వ కాలేజీలు మెరిశాయి. ప్రైవేటు కాలేజీలతో పోటీపడి మరీ మంచి ఫలితాలు సాధించాయి. ప్రైవేటు కాలేజీలతో తామేమీ తీసిపోమని... జిల్లా సగటు ఫలితాలతో సమానంగా 69 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. పదో తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులను చేర్చుకుని కూడా ప్రైవేటు కాలేజీలు ఇంటర్మీడియట్‌లో అంతంత మాత్రమే ఫలితాలు సాధించాయి.

మరోవైపు పదో తరగతిలో ప్రైవేటు విద్యార్థులతో పోలిస్తే తక్కువ మార్కులు వచ్చిన  విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకుని కూడా ప్రైవేటుతో పోటీగా ఫలితాలు సాధించి...ప్రభుత్వ మార్క్ చెక్కు చెదరలేదని నిరూపించాయి. అయితే, ప్రభుత్వ కాలేజీలను వేధిస్తున్న అధ్యాపకుల కొరత, అదనపు తరగతుల నిర్మాణం, మౌలిక సదుపాయాల లేమి వంటి సమస్యలను ప్రభుత్వం తీరిస్తే మరింత మంచి ఫలితాలు సాధించగలమని ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్స్, లెక్చరర్లు పేర్కొంటున్నారు.

ఫెయిలైన ‘ప్రైవేటు’ విద్యార్థులు 6,642
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 30,270 మంది విద్యార్థులు హాజరవ్వగా...20,999 మంది పాసయ్యారు. జిల్లా సగటు ఉత్తీర్ణత శాతం 69 శాతం. ప్రైవేటు కాలేజీల్లో జిల్లాలో 22,413 మంది పరీక్షకు హాజరుకాగా 15,771 మంది విద్యార్థులు పాసయ్యారు. అంటే, మిగిలిన 6,642 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మరోవైపు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలల్లో 6,317 మంది సెకండియర్ ఇంటర్ పరీక్షకు హాజరుకాగా, 4,345 మంది ఉత్తీర్ణులయ్యారు.

ప్రభుత్వ కాలేజీల్లో ఫెయిలైన విద్యార్థుల సంఖ్య కేవలం 1,972 మంది మాత్రమే. అం టే ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం కూడా జిల్లా సగటుతో సమానంగా 69 శాతం కావడం గమనార్హం. ఇక ఎయిడెడ్ కాలేజీల విషయానికి వస్తే జిల్లావ్యాప్తంగా 1540 మంది పరీక్షకు హాజ రుకాగా... 880 మంది ఉత్తీర్ణులయ్యా రు. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలను కలిపినా....2,632 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మరోవైపు ప్రభుత్వ కాలేజీల్లో ప్రతీ ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది.

మరిన్ని వార్తలు