ప్రజా ఫిర్యాదులకు చట్టం

20 Jul, 2019 14:21 IST|Sakshi
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వినయ్‌ చంద్‌

ప్రతి అధికారి స్పందనకు వందనం పలకాల్సిందే

ప్రతి అర్జీకి పరిష్కారం చూపాల్సిందే

కార్యాలయాలకు చేరిన కొత్త మార్గదర్శకాలు

ఫిర్యాదుల పరిష్కారంలో దూసుకుపోతున్న అధికారులు

ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల నమోదు

ఒక సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కరించేవారు కాదు.. అర్జీలిచ్చి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండేది కాదు. ఇలాంటి అర్జీలన్నీ బుట్టదాఖలయ్యేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది.. స్పందన కార్యక్రమానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు అర్జీ ఇస్తే ఆ సమస్య కచ్చితంగా పరిష్కారం కావాల్సిందే. ఎప్పుడు పరిష్కరిస్తారు..? ఎన్ని రోజులు సమయం కావాలి..? తదితర వివరాలతో కూడిన రశీదు ఇస్తున్నారు. దీనిపై అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ఫిర్యాదులకు పట్టం కట్టింది. ప్రజల నుంచి వచ్చే ప్రతి స్పందన ఫిర్యాదుకు సంబంధిత అధికారులు ఇపుడు వందనం పలకాల్సిందే. స్పందన ద్వారా ప్రజల నుంచి వచ్చిన సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో రశీదులో తేదీని పొందుపరిచి సంబంధిత ఫిర్యాదుదారుకు తిరిగి అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని అర్జీలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని కూడా సూచించారు. నిత్యం ప్రజా ఫిర్యాదులపై సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుంటుంది. ముఖ్యమంత్రి రచ్చబండ, అధికారిక కార్యక్రమాల్లో ఎప్పుడైనా వీటిని పర్యవేక్షించే అవకాశం ఉంటుందని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. ఒక వేళ ఫిర్యాదు పరిష్కారం కాని పక్షంలో ఎందుకు ఆ సమస్య తీరలేదో రాతపూర్వకంగా  తెలపాల్సి ఉంటుంది. తద్వారా సీఎం ఫిర్యాదులకు జవాబుదారీని తీసుకువచ్చారు.

ప్రతి అర్జీ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి
స్పందన కార్యక్రమంలో వస్తున్న ప్రతి ఆర్జీని ఆన్‌లైన్‌ ద్వారా స్పందన పోర్టల్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. అర్జీదారుకు ఇచ్చిన తేదీలోపల సమస్యను పరిçష్కరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ మధ్యకాలంలో అర్జీదారు ఇచ్చిన దరఖాస్తు ఏ అధికారి వద్ద పరిశీలన నిమిత్తం ఉందో కూడా తెలుసుకొనే వెసులుబాటు కల్పించారు. ఈ పోర్టల్‌ను సీఎం కార్యాలయం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది.

పెరిగిన జవాబుదారీతనం
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ఈ కొత్త విధానంతో అధికారుల్లో జవాబుదారీతనం పెరిగింది. ప్రజలు ఇచ్చే ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలి. పరిష్కరించలేని సమస్య ఏదైనా ఉంటే ఎందుకు పరిష్కారం కాలేదో అధికారికంగా రాతపూర్వకంగా అర్జీదారుకు ఇవ్వాలి. చిన్న సమస్యలు అయితే ఎక్కువ రోజులు చెప్పడానికి అసలు కుదరదు. ఇలా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయడంతో అధికారులకు జవాబుదారీతనం పెరిగింది.

సమస్యల పరిష్కారంలో మిన్నగా జిల్లా
స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కరంలో జిల్లా దుసుకుపోతుంది. ఇప్పటి వరకు 8432 ఫిర్యాదులు రాగా అందులో 6066 సమస్యలకు ఆధికారులు పరిష్కర మార్గాన్ని చూపించారు. 312 దరఖాస్తులను కొన్ని సరైన ఆధారాలు లేక తిరస్కరించారు. ఇంకా 2054 ఫిర్యాదులను అధికారులు పరిష్కరిచాల్సింది.

అదనపు కౌంటర్ల ఏర్పాటు
సమస్యలు వేగంగా పరిష్కారం కావడంతో ప్రతి వారం స్పందన కార్యక్రమానికి అర్జీదారుల తాకిడి పెరగడంతో కలెక్టరేట్‌లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. గత వారం రికార్డు స్థాయిలో 890 అర్జీలు వచ్చాయి. ఇకపై మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి వరకు 10 కౌంటర్లు ఉండా వాటికి అదనంగా మరో 10 కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్‌ వద్ద ఒక కంప్యూటర్‌ను ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.  

మమల్ని క్రమబద్ధీకరించండి..
2001లో ప్రభుత్వ ఉత్వర్వులతో నియమించబడ్డ మమ్మల్ని క్రమబద్ధీకరించి న్యాయం చేయాలి. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, మెరిట్‌ ఆ«ధారంగా జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా నియమించబడ్డాం. మలేరియా, డెంగీ, వంటి కీటక జనిత వ్యాధులు నివారణ, పల్స్‌పోలియో, టీబీ నివారణ, శానిటేషన్‌ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ జాతీయ, రాష్ట్ర ఆరోగ్య పథకాల అమలుకు కృషి చేస్తున్నాం.15 ఏళ్లుగా ఆరోగ్య రంగంలో చాలీచాలని జీతాలతో సేవలు అందిస్తున్నాం. హెల్త్‌ కార్డు, రేషన్‌కార్డు, రవాణా భత్యం లేకుండా కుటుంబ పోషణ కష్టం అవుతున్న తరుణంలో ప్రభుత్వం మమల్ని క్రమబద్ధీకరించాలి. ఇప్పటికే దీనిపై మంత్రులతో సబ్‌కమిటీ వేయడం సంతోషంగా ఉంది. ఇందుకు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.    – ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు

ఉద్యోగుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్‌ వినయ్‌ చంద్‌
ఉద్యోగుల స్పందనకు 166 ఫిర్యాదులు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : ప్రజా సమస్యలతోపాటు ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశించారని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అధికారులకు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.  వివిధ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు కలిపి 166 మంది తమ ఫిర్యాదులను కలెక్టర్‌కు, జేసీకి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం ఆదేశాలను అనుసరించి ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగుల సమస్యలపై దరఖాస్తులను స్వీకరిరిస్తామన్నారు. ప్రతి గురువారం జేసీ నిర్వహించే స్పందన సమీక్షతో పాటు ఉద్యోగుల స్పందనపై కూడా సమీక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జేసీ శివశంకర్, జేసీ–2 వెంకటేశ్వరావు పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌ ప్రారంభం
ప్రభుత్వ ఉద్యోగులు సమస్యల నివేదికలను, పరిష్కారాలతో కూడిన ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ శుక్రవారం ప్రారంభించారు. ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులను www.egs. vizagcollectorate.in వెబ్‌సైట్‌ ద్వారా సంబంధిత శాఖాధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. 

మరిన్ని వార్తలు