అక్రమాలకు రాచబాట..లంక మేట

20 Jul, 2014 00:18 IST|Sakshi
అక్రమాలకు రాచబాట..లంక మేట

 రాజానగరం :గోదావరిలో ఇసుక తవ్వకాలపై ఆంక్షలున్నా సీతానగరం మండలంలో అవి చిరుఅల పాటి చెయ్యవు. ఈ ప్రాంతం నుంని నిత్యం వందలాది ఆవహనాల్లో ఇసుక జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు విశాఖ, హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు కూడా యధేచ్ఛగా తరలిపోతోంది. నిత్యం లక్షలాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్న ఈ ఇసుక మాఫియాను నిరోధించడం అటుంచి ఇసుకను తరలించే వాహనాల తాకిడికి రోడ్లు పాడైనా, ప్రజల కళ్లలో ఇసుక కొట్టినా పట్టించుకునే వారే లేరు. ‘దొంగ ఇసుక’ తెచ్చే కష్టాలను భరించలేని ప్రజలు ఆందోళనలు చేపట్టినా ప్రయోజనం ఉండటం లేదు. అధికార, ప్రతిపక్షాలు ఏకపక్షంగా సాగిస్తున్న ఈ ఇసుక దందాను నిరోధించవలసిన అధికారులు ముడుపులు మెక్కి మిన్నకుంటున్నారు.
 
 మండలంలో పురుషోత్తపట్నం, వంగలపూడి, రామచంద్రాపురం, సీతానగరం, ముగ్గళ్ల, ఇనగంటివారిపేట, వెదుళ్లపల్లి, ుునికూడలి, కాటవరం, బొబ్బిలిలంక, ములకల్లంక, శింగవరం, ర ఘుదేవపురంల లోని లంక భూముల్లో కొందరు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఆ భూముల్లో వేసిన ఇసుక మేటలని తొలగించే నెపంతో ఇసుక తరలింపునకు అనుమతులు పొందుతున్నారు. ఇసుక మేటల్ని తొలగిస్తే పం టలు బాగా పండుతాయన్న వ్యవసాయశా ఖ మాట అనుమతులకు సాకుగా మారు తోంది. తమ పట్టా భూముల్లో ఇసుక తీత కు అనుమతులు పొందుతున్న రైతుల నుం చి గుత్తేదార్లు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు చెల్లించి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగిస్తున్నారు.
 
 ఈ అనుమతుల మాటునే అనుమతులు పొందని భూముల నుంచి, గోదావరి గర్భం నుంచి ఇసుకను తవ్వేస్తూ కోట్లు గడిస్తున్నారు. మండలంలోని ఏటిపట్టు గ్రామాలన్నీ ఇసుక రవాణాకు నెలవులుగా మారడంతో రోజుకు వెయ్యి నుంచి 2000 లారీల ఇసుక రవాణా జరుగుతోంది.  విశాఖ, హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు కూడా ఇసుక తరలిపోతోంది. లారీల వరకు ఇసుకను చేరవేసేందుకు కొందరు అప్పటికప్పుడు మినీవ్యాన్‌లు కొనుగోలు చేశారంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
 
 పల్లెల్లో రేగుతున్న వర్గచిచ్చు...
  వివిధ గ్రామాల్లో ఇసుక రవాణాతో లబ్ధి పొందుతున్న వారు, దానివల్ల ఇబ్బందులు పడుతున్న వారు వర్గాలుగా చీలి ఘర్షణ పడుతున్నారు. ములకల్లంక, బొబ్బిలిలంక వాసుల మధ్య శుక్రవారం వివాదం తలెత్తింది. ‘లంకభూముల్లోని  బొండు మట్టి (గోదారి ఇసుక)ని తరలిస్తుంటే మీకేంటి అభ్యంతరమని ఒక వర్గం, ఇసుక తరలింపుతో రోడ్లు పాడవుతున్నాయని  మరోవర్గం వాదనకు దిగారు.  టెంట్లు వేసి ఆందోళనకు సిద్ధమయ్యారు.  
 
 పోలీసు కేసులు నామమాత్రమే..
 ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇటీవల కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే విమర్శలను తప్పించుకునేందుకు నామమాత్రంగానే ఈ కేసులు నమోదు చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక ర్యాంపును అధికారులు తనిఖీలు చేసి, అనధికారికంగా ఉన్న ఇసుక నిల్వలను స్వాధీనపర్చుకోవడం, వాటికి పోలీసు పహారా ఏర్పాటు చేయడం కూడా నాటకంలో భాగమేనంటున్నారు. ఒక్కోసారి పట్టుబడిన వారికి రూ.వెయ్యి నామమాత్రపు జరిమానా వేసి వదిలేస్తున్నారని అంటున్నారు. అదేమంటే రాజకీయ ఒత్తిడులంటున్నారని విమర్శిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం ఎంపీడీఓ, తహసీల్దారు, పోలీసు, గనులశాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలు వేసింది. అయినా అధికార పార్టీ పెద్దల అండదండలతో ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. అధికారులకు మామూళ్లు అందడంతో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మా మూళ్లు ముట్టని సందర్భాల్లో ఇసుక రవాణాను అడ్డుకుంటున్నట్టు హడావిడి చేస్తున్నారని, అవతలి వ్యక్తులు చేతులు తడపగానే చేతులు ముడుచుకుంటున్నారు.
 
 ఆందోళనలు అరణ్యరోదనలే..
 ఇసుక రవాణాతో శింగవరం సమీపంలో ఏటిగట్టుతోపాటు, సీతానగరంలో ప్రధాన రహదారి పూర్తిగా పాడైంది. ఇసుక లారీలు, ట్రా క్టర్లు ప్రయాణికుల కళ్లల్లో దుమ్ము కొడుతూ, ఇసుకెత్తి పోస్తున్నాయి.  డ్రైవర్లు వాహనాలను జోరుగా నడపడంతో దుమ్ములేచి వెనుక వచ్చే వాహనాల ప్రయాణానికి ఇబ్బందిగా మారుతోంది. ఇసుక వాహనాలతో ఒక్కోసారి ట్రాఫిక్ జామ్  అవుతోంది. అయినాఅధికారులకు చీమ కుట్టినట్టుండటం లేదని, తాము చేసే ఆందోళనలు అరణ్యరోదనగానే మిగిలి పోతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
 

>
మరిన్ని వార్తలు