‘నౌకాయాన ప్రోత్సాహకానికి మరిన్ని చర్యలు’

27 Mar, 2017 15:30 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశ తీరప్రాంతాల్లో నౌకాయానానికి ఉన్న అన్ని సమస్యలను తొలగించే చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‍ప్రస్తుతం వాడకంలో ఉన్న తీర ప్రాంతాలనే కాకుండా అదనపు ప్రాంతాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం, అదనపు మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయడంవంటివి చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర నౌకాయాన శాఖ సహాయమంత్రి సోమవారం రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

బంకర్‌ ప్యూయెల్స్‌పైన కస్టమ్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయింపు అందులో పేర్కొన్నారు. రోడ్డు, రవాణ మార్గాలతో పోలిస్తే నౌకాయానంలో సర్వీస్‌ చార్జీలను 70శాతానికి తగ్గించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోర్టు ప్రాంతంలో ఏర్పాటుచేసే మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 50శాతం వరకు సహాయం అందజేస్తుందని చెప్పారు. పెద్దపెద్ద పోర్టులు నిర్వహిస్తున్న రో రో నౌకలకు డిస్కౌంట్‌ 40శాతం నుంచి 80శాతం వరకు రెండేళ్ల కాలానికి పెంచినట్లు వివరించారు.

ఏప్రిల్‌ 1, 2016 నుంచి 31 మార్చి 2026 మధ్యకాలంలో నౌకల నిర్మాణానికి షిప్‌ బిల్డింగ్‌ ఫైనాన్షియల్‌ అసిస్టెంట్‌ పాలసీని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. సాగరమాల ప్రోగ్రాం కింద జాతీయ రహదారులను, రైలు లైన్లను సముద్ర తీర ప్రాంతాలతో అనుసంధానించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం కింద 79 ప్రాజెక్టులను గుర్తించినట్లు వివరించారు. మరోపక్క, వృద్ధుల పెన్షన్‌ స్కీంను ఇతర పెన్షన్‌ పథకాలను జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం(ఎన్‌ఎస్‌ఏపీ) కింద ఒకటి చేసే ప్రతిపాదన ఏది ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు