అనకాపల్లిటౌన్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పదహారు రోజులుగా తపాలా ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని గ్రామీణ తపాలా ఉద్యోగుల జేఏసీ సంఘ ప్రతినిధి కె.మనోహర్ అన్నా రు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద బుధవారం చేపట్టిన రిలే నిరాహారదీక్షల్లో ఆయన మాట్లాడారు. కమలేష్ చంద్ర కమిటీ నివేదికను తక్షణమే ప్రభుత్వం ఆమోదించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పీ త్రీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు, ఏఐజీడీఎస్ సంఘం డివిజన్ ఆర్గనైజర్ వి.ప్రకాశరావు, ఎఫ్ఎన్పీవో డివిజన్ కార్యదర్శి ఎ.లోవరాజు, అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
సీఐటీయూ మద్దతు
గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మళ్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 22 నుంచి తపాలా ఉద్యోగులు సమ్మె చేపడతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయం అన్నారు.
వారు చేపడుతున్న ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సంఘ నాయకులు పి.ఎన్.వి.పరమేశ్వరరావు, దాకారపు శ్రీనివాసరావు, ఎస్.బ్రహ్మాజీ, ఎం.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.