ఖాళీ జాగా..వేసేయ్ పాగా

20 Jan, 2014 02:59 IST|Sakshi


 పీలేరు, న్యూస్‌లైన్:
 పీలేరు మెట్ట ప్రాంతంలోని ఓ చిన్న పట్టణం. ఇది ఒకప్పుడు. ఇప్పుడు రాష్ర్ట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి పీలేరుపై పడింది. ఈ ప్రాంతం అభివృద్ధికి  పీలేరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పడా)ని ఏర్పాటు చేశారు. వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భూముల రేట్లు అ మాంతంగా పెరిగిపోయాయి. అక్రమార్కుల కన్ను ఖా ళీస్థలాలపై పడింది. రాత్రికి రాత్రే కోట్లు విలువజేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.అధికార పార్టీకి చెందిన నేతల సహకారంతోనే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 పీలేరు పట్టణం, దీనికి ఆనుకుని బోడుమల్లువారిపల్లె, ఎర్రగుంట్లపల్లె, కాకులారంపల్లె, దొడ్డిపల్లె, వేపులబైలు, ముడుపులవేముల పంచాయతీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్రమార్కులు ఈ ప్రాంతంలో డీకేటీ, అసైన్డ్, పొరంబోకు భూముల వివరాలను సేకరిస్తున్నారు. వా టిల్లో ఖాళీగాఉన్న భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదంతా తెలిసినా రెవె న్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పీలేరులో అధికార పార్టీ నేతల అండదండలతో రెవెన్యూ అధికారుల సహకారంతో,  అనర్హులకు ఇళ్ల స్థలాలను కట్టబెట్టారన్న ఆరోపణలు వచ్చాయి.
 
  ప్రధానంగా పీలేరు శివారు ప్రాంతం తిరుపతి మార్గంలోని జాతీయ రహదారికి ఇరువైపులా, నూనెవిత్తుల కర్మాగారం సమీపంలో, పీలేరు పట్టణ శివారు ప్రాంతం నాగిరెడ్డి కాలనీ పరిసర ప్రాంతాలు, మదనపల్లె మార్గంలోని పెద్దిరెడ్డి కాలనీ, రజకులు, నాయీబ్రాహ్మణులు, పంచాయతీ వర్కర్లు, ఎమ్మార్పీఎస్, ఐకేపీ, ఈజీఎస్ తదితర కుల సంఘాలకు ఇచ్చిన పట్టాల్లో స్థానికేతరులు, అనర్హులే ఎక్కువ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మదనపల్లె సబ్‌కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఏడాదిన్నర కాలంలో పీలేరు పట్టణంతో పాటు, పరిసర ప్రాంతాల్లో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు. అయితే కిందిస్థాయి సిబ్బంది తీరు మొక్కుబడిగా ఉంది. ప్రస్తుతం చేనేత కార్మికులు, నాయీబ్రాహ్మణులకు పంపిణీ చేసిన పట్టాలపై విచారణ జరుగుతోంది. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో నివాసముంటున్నా తమను కాదని స్థానికేతరులు, అనర్హులకే అగ్రపీఠం వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు