సాక్షి, చిత్తూరు:‘‘ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందించడం లేదు. పేదల సంక్షేమానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. నెల నెలా పింఛన్లు రావడం లేదు. రేషన్ కార్డు కోసం ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. పక్కా ఇళ్లు మంజూరు చేయడం లేదు. రుణ మాఫీ పేరుతో మోసం చేశారు’’అంటూ జనం వైఎస్ఆర్సీపీ నేతల ముందు వాపోయారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా బుధవారం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం నిండ్ర మండలం ఎంఎస్వీఎం పురం, మిట్టూరు గ్రామాల్లో పర్యటించారు.
గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి పెనుమూరు మండలం తాటిమాకులపల్లెలో, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ బంగారుపాళెం మండలం మొగిలి పంచాయతీ పరిధిలో ఇంటింటికి వెళ్లి జనం సమస్యలు తెలుసుకున్నారు. చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు అనుప్పల్లెలో, కుప్పం సమన్వయకర్త చంద్రమౌళి శాంతిపురం మండలం తూవిటి గ్రామంలో, సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం నాగలాపురం బీసీ కాలనీలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టారు.