-

సిండికేట్లకు ‘రూ.5 వరం’

3 Dec, 2013 03:32 IST|Sakshi
సిండికేట్లకు ‘రూ.5 వరం’
  • ఫుల్‌బాటిల్ మద్యం ధరపై రూ.5 అదనంగా అమ్ముకునేందుకు అనధికార అనుమతి
  •      లిక్కర్ సిండికేట్లకు సర్కార్ చట్టవిరుద్ధ వరం
  •      క్వార్టర్ మీదే రూ.5 అదనంగా తీసుకుంటున్న లిక్కర్ సిండికేట్లు
  •      ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేత సొంత నియోజకవర్గాల్లో ‘డబుల్’ దోపిడీ
  •      ‘సాక్షి’ పరిశీలనలో లిక్కర్ సిండికేట్ల అక్రమాలు బట్టబయలు
  • సాక్షి, హైదరాబాద్: లిక్కర్ సిండికేట్లకు ప్రభుత్వం ‘ఐదు రూపాయల వరం’ ప్రకటించింది. మద్యం ఎమ్మార్పీ ధర మీద రూ.5 అదనంగా వసూలు చేసుకోవడానికి ఎక్సైజ్ కమిషనర్ అనధికారికంగా అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ మంత్రి, లిక్కర్ డీలర్ల అసోషియేషన్ చేసిన ఒత్తిడికి  కమిషనర్ తలొగ్గినట్టు సమాచారం. రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్న ఎన్టీపీఎల్ మద్యం, కల్తీ మద్యం నిరోధించాలంటే ఎమ్మార్పీ ఉల్లంఘన తప్ప మరో మార్గం లేదని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. దొరికిన వెసులుబాటుతో లిక్కర్ సిండికేట్లు క్వార్టర్ బాటిల్ మీద రూ.5 అదనంగా అమ్ముతున్నాయి.
     
     ఈ లెక్కన ఫుల్ బాటిల్‌కు రూ.20 పైగా అదనంగా అమ్ముతుండగా... ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సొంత నియోజకవర్గాలు పీలేరు, కుప్పంలో క్వార్టర్ మీద రూ.10, ఫుల్ బాటిల్ మీద రూ.40 అదనంగా తీసుకుంటున్నారు. ‘సాక్షి’ ప్రతినిధులు పరిశీలనాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 19 జిల్లాల్లో మద్యం కొనుగోలు చేయగా ఒక్క హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోని మద్యం దుకాణాల్లో కూడా గరిష్ట చిల్లర ధర నిబంధన ఉల్లంఘించారు. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ డబ్బు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే మద్యం ధరలు  పెరిగాయని చెప్తున్నారు. ఏసీబీ దాడులతో కేసుల పాలై అదనపు ఆదాయాన్ని కోల్పోయిన స్థానిక ఎకై ్సజ్ అధికారులు కూడా ఇప్పుడు సిండికేటుకు పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రతి క్వార్టర్‌కు పెంచిన రూ.5లో రూ 2 ఎకై ్సజ్ అధికారులకు (కింది నుంచి పై స్థాయి అధికారుల వరకు), రూ.3 లిక్కర్ సిండికేట్లు తీసుకోవాలని రహస్య ఒప్పందం కుదిరినట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఏపీబీసీఎల్ డిపోల నుంచి  డీలర్లు తీసుకున్న మద్యం వివరాలు దుకాణాల వారీగా తీసుకొని వాటి ఆధారంగా నెలనెల లెక్కలు వేసి డబ్బు పంచుకోవాలని ఎక్సైజ్ సిబ్బంది, మద్యం సిండికేట్ల మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం.
     

    • ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో ఆయన ప్రధాన అనుచరుడు ఓ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దుకాణంలో మద్యం కొనుగోలు చేయగా ప్రతి బ్రాండ్ మీద క్వార్టర్‌కు రూ.10 అదనంగా తీసుకున్నారు. ఫుల్ బాటిల్‌కు రూ.40 అదనం. నియోజకవర్గం అంతటా ఇవే ధరలు ఉన్నాయి
    • ప్రతిపక్ష నాయకుడు చం ద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని ఆయన అనుచరుని దుకాణంలో కూడా క్వార్టర్ మీద రూ.10 అదనంగా తీసుకున్నారు.
    • వైఎస్సార్ జిల్లాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన నియోజకవర్గ కేంద్రం లోనే బినామీ పేరుతో వైన్ షాపు  తెరిచారు. దుకాణం తెరిచిన 2 నెలల వ్యవధిలోనే క్వార్టర్ మద్యంకు ఎమ్మార్పీ ధర మీద రూ.10 అదనంగా తీసుకుంటూ ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులకు దొరికిపోయారు. ఇదే జిల్లాలో సదరు ఎమ్మెల్యేకు కమలాపురంలో రెండు, ఎర్రగుంట్లలో ఒక దుకాణం, ప్రొద్దుటూరులో బార్ అండ్ వైన్స్ బినామీల పేర్లతో ఉన్నాయి.  ఈ దుకాణాలన్నింటిలోనూ ఇప్పుడు ఫుల్ బాటిల్ మీద బ్రాండును బట్టి రూ.15నుంచి రూ.25 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
    • అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న 11 మద్యం దుకాణాలను ఒకే సిండికేటు కిందకు తెచ్చారు. అన్ని దుకాణాల్లో కూడా ఒకే ధర ఉంది. ప్రతి క్వార్టర్ మద్యం సీసా మీద బ్రాండును బట్టి ఎమ్మార్పీ మీద రూ.6నుంచి రూ.12 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
    • విశాఖపట్నం  సిటీతో పాటు, రూరల్ ప్రాంతంలోని యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి పట్టణాల్లో ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  అజమాయిషీ కింద 25 మద్యం దుకాణాలు ఉన్నాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు నిర్ధారించింది. ఈ దుకాణాల్లో  క్వార్టర్‌కు రూ.5 ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతోంది.
    • ప్రకాశం జిల్లా చీరాలలో దాదాపు 6 మద్యం దుకాణాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ యువ ఎమ్మెల్యే ఆధీనంలో ఉన్నాయి. ఈ దుకాణాల్లో క్వార్టర్ చీప్ లిక్కరుకు రూ.10, మీడియం లిక్కర్‌కు రూ.15, ప్రీమియం లిక్కర్‌కు రూ.15 చొప్పున ఎమ్మార్పీ మీద అదనంగా  వసూలు చేస్తున్నారు.
    • విజయనగరం జిల్లాల్లో గత ఏడాది ఏసీబీ దాడుల నేపథ్యంలో కొద్దికాలం స్తబ్దుగా ఉన్న కీలక నేత బంధువులు మళ్లీ తెర మీదకు వచ్చారు. ఆయన సోదరులిద్దరూ, మేనల్లుడు కలిసి విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, విశాఖ జిల్లా అనకాపల్లి మద్యం దుకాణాల్లో పాగా వేశారు. క్వార్టర్ సీసా మీద రూ.5 నుంచి రూ.10 వరకు పెంచి అమ్ముతున్నారు. దీనిపై మాజీ ఎకై ్సజ్ కమిషనర్ శర్మ గతంలోనే శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
    • పాలమూరు జిల్లాలో ఓ మంత్రి బంధువుల కనుసన్నల్లోనే 2 డివిజన్లలో మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ఇక్కడి మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్‌కు రూ.20, మీడియం, ప్రీమియం లిక్కర్ ఫుల్ బాటిల్‌కు రూ.30 చొప్పున అదనంగా తీసుకుంటున్నారు.
       
మరిన్ని వార్తలు