సిగ్గు లేకుండా పింఛన్లు తీసుకోండి

11 Nov, 2014 03:36 IST|Sakshi
సిగ్గు లేకుండా పింఛన్లు తీసుకోండి

* చంద్రబాబు ఫొటోకు దండం పెట్టుకోండి  
* ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్

 ఏలూరు రూరల్ : ‘టీడీపీకి ఓట్లు వేయని వారు సిగ్గు లేకుండా పింఛన్లు తీసుకోండి. కాకపోతే వాళ్లంతా చంద్రబాబునాయుడు ఫొటోకు దండం పెట్టుకోండి’ ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పింఛను లబ్ధిదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మల్కాపురంలో సోమవారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ సభలో పాల్గొన్న ఆయన పింఛనుదారులను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ‘మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేశారు. మీరు నాకు నీళ్లు పోసినా, నేను పాలు పోస్తున్నా. అర్హులైన వారందరకీ పింఛన్లు ఇప్పిస్తా. అయితే మీకు నన్ను ప్రశ్నించే హక్కు లేదు’ అని వ్యాఖ్యానించారు.

మాదేపల్లిలో జరిగిన సభలోనూ ఇదేవిధంగా మాట్లాడారు. ‘ఎంపీపీ మనవాడు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులూ మన పార్టీయే. ఒక్క సర్పంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. నన్ను ఓటమి పాలు చేద్దామనుకున్న సర్పంచ్ కోసూరి సుబ్బారావుకు రెండు దండాలు’ అంటూ హేళన చేశారు. చింతమనేని ఇలా మాట్లాడటంపై గ్రామస్తులు విస్తుపోయారు. ప్రజాప్రతినిధిగా పార్టీలకు అతీతంగా పనిచేయాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరచి, ప్రజలను పార్టీల ప్రాతిపదికన విడదీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ రెడ్డి అనురాధ, జెడ్పీటీసీ సభ్యులు మట్టా రాజేశ్వరి, మండల ఉపాధ్యక్షులు మోరు హైమావతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు