రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు

14 Aug, 2015 00:53 IST|Sakshi
రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు

- ఎమ్మెల్సీ మేకా శేషుబాబు
పాలకొల్లు టౌన్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయల సబ్సిడీ అందిస్తున్నాయని, దేశానికి వెన్నుముక అయిన రైతులకు అందించే రాయితీల విషయంలో వెనుకంజ వేస్తున్నాయని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. పాలకొల్లు మార్కెట్‌యార్డులో గురువారం రైతులకు సబ్సిడీపై పవర్‌టిల్లర్‌లు పంపిణీ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సభకు ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అధ్యక్షత వహించారు. పాలకొల్లు నియోజకవర్గంలో 878 మంది రైతులకు పవర్ టిల్లర్లు పంపిణీ చేయాల్సి వుండగా కొందరికే అందించారన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా చేసి పంటల బీమా పథకాన్ని అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు.
 
ప్రభుత్వవిప్ అంగర రామమోహన్, ఎమ్మెల్యే డాక్టర్  నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా సబ్సిడీపై 30 పవర్‌టిల్లర్‌లు, మూడు వరికోత యంత్రాలు, 20 ఆయిల్ ఇంజన్లు, వంద టార్పాలిన్‌లు పంపిణీ చేశారు. మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్‌చైర్మన్ కర్నేన రోజారమణి, జెడ్పీటీసీ కోడి విజయలక్ష్మి, యలమంచిలి ఎంపీపీ బొప్పన సుజాత, మునిసిపల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, ఆత్మ చైర్మన్‌లు అందే కోటి వీరభద్రం, ఆరిమిల్లి రామశ్రీనివాస్ (చిన్ని), వీఎస్‌టీ కంపెనీ ప్రతినిధి ప్రసాద్, శ్రీరామ ఆటోమొబైల్స్ అధినేత బలుసు శ్రీరామమూర్తి, ఏడీఏ పి మురళీకృష్ణ, ఏవో ఇడవలూరి సుజాత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు